
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి వేములవాడ, డిసెంబర్, 19: దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడలో మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తానని కరీంనగర్ – ఆదిలాబాద్ -నిజామాబాద్ -మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం వేములవాడ పట్టణంలో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పట్టణంలోని తెలంగాణ తల్లికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని లైబ్రరీని బలోపేతం చేస్తూ సెంట్రల్ లైబ్రరీగా మార్చుతానని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ రూపకల్పనలో ముందుంటానని తెలిపారు. చదువుతోపాటు క్రీడల పట్ల ఆసక్తి ఉన్నట్లయితే యువత ప్రయోజకులవుతారని పేర్కొన్నారు. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో గత మూడు నెలలుగా పర్యటిస్తున్నానని, ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో 80% ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయనే విషయం దృష్టికి వచ్చిందని, వాటి భర్తీకి కృషి చేస్తానని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్ అమలుకు కృషి చేస్తానని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతకు బాసటగా నిలుస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగాలు రాకపోవచ్చు, నిరుద్యోగ యువత కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సర కాలంలో అనేక ఉద్యోగాలు కల్పించిందని గుర్తు చేశారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు స్టడీ మెటీరియల్ అందజేస్తున్నట్టు వెల్లడించారు. బీఈడీ, డిఈడ్ యువతీ, యువకులకు తన సొంత నిధులతో నిపుణులైన అధ్యాపకులచే టెట్ కోచింగ్ అందిస్తున్నట్టు వెల్లడించారు. రానున్న పట్టభద్రుల ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఓటర్ నమోదు ప్రక్రియలో ముందున్న యువత ఓటింగ్ శాతం పెంచే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు, దొగ్గలి శ్రీధర్, పరుశురాం, జితేందర్ రెడ్డి, శ్యాంసుందర్, వి సతీష్ కుమార్, బాలచందర్, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు.









