
కుమార్ యాదవ్, రిపోర్టర్ జమ్మికుంట: జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్థనగ్న ప్రదర్శన చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని రామన్న పల్లె గ్రామంలో గల స్మశాన వాటికలో నిధులు కేటాయించాలని వార్డ్ కౌన్సిలర్ మేడిపల్లి రవీందర్ పలుమార్లు చైర్మన్ తో పాటు, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోకుండా వ్యవహరించడంతో, మంగళవారం కౌన్సిల్ సమావేశం జరుగుతున్నప్పుడు కార్యాలయం ఎదుట మోకాళ్లపై బైఠాయించి, అర్థనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ రవీందర్ మాట్లాడుతూ.. రామన్నపల్లి గ్రామంలో స్మశాన వాటిక లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, గతంలో స్మశాన వాటికకు వెళ్ళనీకి దారి లేదని, తెలపడంతో స్థానిక తహసిల్దార్ తో మాట్లాడి, దారి ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. అయినప్పటికీ మునిసిపాలిటీకి వచ్చిన నిధుల నుండి స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయకుండా, చైర్మన్ తో పాటు కమిషనర్, జాప్యం చేస్తున్నారని దీనికి తోడు వారికి అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే నిధులు మంజూరు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అధికారులు స్పందించి ప్రజలకు అవసరమైన స్మశాన వాటికకు నిధులు మంజూరు చేయాలని కౌన్సిలర్ రవీందర్ డిమాండ్ చేశారు.

