Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ప్రతి డ్రైవర్ వాహనాలు నడిపేటప్పుడు తన కుటుంబం గురించి ఆలోచిస్తే ప్రమాదాలు సగానికి పైగా తగ్గుతాయని హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసొత్సవాలను పురస్కరించుకొని హుజురాబాద్ బస్టాండ్ ఆవరణలో ఆటో డ్రైవర్లతో రహదారి భద్రతా నియమాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎంవిఐ కంచి వేణు మాట్లాడుతూ….ప్రతి డ్రైవర్ తన కుటుంబం గురించి తన వాహనంలో ప్రయాణిస్తున్న వ్యక్తుల కుటుంబాల గురించి వారి భద్రత గురించి ఆలోచించినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని అన్నారు. ప్రతి ఒక్కరికి రోడ్డు భద్రత నియమాలు తెలిసి ఉండాలని వాటిని పాటించడం వల్ల మన కుటుంబాలు చక్కగా ఉండడంతో పాటు ఎదుటివారి కుటుంబాలు కూడా బాగుంటాయని అన్నారు. ప్రతి వ్యక్తి ద్విచక్ర వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం చేయాలని, కార్లను నడిపే సమయంలో సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని అన్నారు. వాటి వల్ల అనుకోకుండా జరిగే ప్రమాదాల నుండి ఎక్కువ నష్టం జరగకుండా కాపాడుకోగలుగుతామని అన్నారు. రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం జరిగితే ఎవరూ ప్రాణాలను తిరిగి తీసుకొని రాలేరని అందువల్లనే సక్రమంగా భద్రత నియమాలు పాటిస్తే బాగుంటుందన్నారు. ప్రతి డ్రైవర్ తన లైసెన్స్ తో పాటు వాహన ఇన్సూరెన్స్ ఉండేలా చూసుకోవాలన్నారు. రోజురోజుకు వాహనాల సంఖ్య పెరుగుతున్నందువల్ల ప్రతి ఒక్కరికి అవగాహన లేకపోతే ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉంటాయని అందువల్ల ప్రతి ఒక్కరూ రహదారి భద్రత నియమాలు తెలుసుకొని ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో హోంగార్డు శ్రీకాంత్, నాగరాజు ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.








