Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జనవరి11: హుజురాబాద్ మండలం శాలపల్లి గ్రామానికి చెందిన మండల సరితను బిసి అజాది మహిళ సమైక్య మండల అధ్యక్షురాలుగా నియమిస్తూ బీసీ ఆజాధి ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్, జిల్లా కన్వీనర్ చిలుకమారి శ్రీనివాస్ లు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం హుజురాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో జరిగిన బీసీ మహిళ సమావేశంలో వారిని ఏకగ్రీవంగా నియమిస్తూ ఆమెకు ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ…మహిళా బిల్లులో బీసీ కోటపై స్పష్టత నివ్వాలని, బీసీ మహిళల ఐక్యతతో రాజ్యాధికార సాధన కోసం కృషి చేయాలని, గ్రామ గ్రామాన బీసీల ఐక్యతతో పోరాటాన్ని కొనసాగించాలని కోరారు. సావిత్రిబాయి పూలే, చాకలి ఐలమ్మ, సమ్మక్క సారక్కల స్ఫూర్తితో జాతీయ మహిళా బిల్లులో బీసీల వాటా కోసం పోరాటాన్ని చేస్తామని అన్నారు. అనంతరం నూతనంగా నియమించబడిన నాయకురాలు మండల సరిత మాట్లాడుతూ…తనపై నమ్మకంతో ఈ నియామకం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. బీసీల ఉద్యమ బలోపేతం కోసం నిరంతరం పనిచేస్తానని అన్నారు. తన నియమకానికి కృషిచేసిన జిల్లా కన్వీనర్ చిలక మారి శ్రీనివాస్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఇప్పకాయల సాగర్, నాయకురాలు బింగి రాణి, బీసీ ఆజాది మహిళా సమైక్య రాష్ట్ర అధ్యక్షురాలు చిందం సునీత, జిల్లా అధ్యక్షురాలు తేజశ్రీ లకు కృతజ్ఞతలు తెలిపారు.






