
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని సోమవారం రాత్రి హైదరాబాదులో అరెస్టు చేసి కరీంనగర్ కు తరలించిన క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు హుజురాబాద్ పట్టణంలో టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని 10టీవీ కార్యాలయం వద్ద అదుపులోకి తీసుకున్న కరీంనగర్ పోలీసులు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాత్రి ఉంచారు. నిన్న కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి పై మంత్రులు, ఎమ్మెల్యేల, జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం కు హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ను హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పార్టీ మారిన విషయమై నిలదీయడంతో పాటు వాగ్వాదానికి దిగడంతో అతనిపై పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. దీంతో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు కరీంనగర్కు తరలించగా నియోజకవర్గం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఉండేందుకు ముందస్తుగా హుజురాబాద్ కు చెందిన మున్సిపల్ పాలకవర్గ సభ్యులను, సింగిల్ విండోల పాలకవర్గ సభ్యులను, బిఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుంటున్నారు. హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాలలో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది. రాత్రి హుజరాబాద్ బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కొలీపాక శ్రీనివాస్, హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి, కౌన్సిలర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ వైస్ ఎంపీపీ రమేష్, కౌశిక్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎండి అంజదుల్లాఖాన్ తదితరులను అదుపులోకి తీసుకున్నారు.








