
– ఎస్ఎంఎస్ లు పంపడం నిషేధం.
–ఎన్నికల మార్గదర్శకాలు పాటించాలి.
–నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
–రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్, ఫిబ్రవరి 24: ఈ నెల 27న జరిగే మెదక్ -నిజామాబాదు -కరీంనగర్ -ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో 48 గంటల నిశ్శబ్ద వ్యవధి (సైలెన్స్ పీరియడ్ )అమలులో ఉంటుందని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి నేడొక ప్రకటన లో తెలిపారు. సైలెన్స్ పీరియడ్ లో భాగంగా 25.02.2025 సాయంత్రం 4.00 గంటల నుండి 27.02.2025 సాయంత్రం 4.00 గంటల వరకు బహిరంగ సభలు, ఊరేగింపులు సమావేశాలు నిర్వహించడం, ప్రచారం చేయడం, ఎలాంటి అభ్యంతకరమైన, రాజకీయపరమైన అంశాలతో కూడిన సంక్షిప్త సందేశాలు, బల్క్ ఎస్ఎంఎస్ పంపడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించడం జరిగిందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సైలెన్స్ పిరియడ్ లో ఎవరు కూడా రాజకీయపరమైన ఎస్.ఎం.ఎస్ లు, బల్క్ ఎస్ఎంఎస్ లను పంపకూడదని, బహిరంగ సభలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించకూడదని, ప్రచారం చేయరాదని కలెక్టర్ సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. సైలెన్స్ పీరియడ్ లో నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే విచారణ జరిపి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, ఎన్నికల ప్రవర్తనా నియమావళి 1961 ప్రకారం జారీ చేయబడిన సూచనలు, ఆదేశాల మేరకు బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. 48 గంటల సైలెన్స్ పీరియడ్ సమయంలో జిల్లాయేతర వ్యక్తులు ఎవరు కూడా జిల్లాలో ఉండవద్దని స్పష్టం చేశారు. ఎఫ్ఎస్టి, ఎస్ ఎస్ టి, ఎంసీసీ, పోలీస్ అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, కళ్యాణ మండపాలు, హోటళ్లు, లాడ్జింగ్ ల్లో విస్తృతంగా తనిఖీ చేపట్టాలని కలెక్టర్ సూచించారు. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సెక్షన్ 126(1)(బి) ఆర్పీ యాక్ట్ 1951 ప్రకారం ఒపీనియన్ పోల్, ఎగ్జిట్ పోల్స్ నిషేధమని రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసే వరకు ఎన్నికలు నిర్వహించే ఆయా జిల్లాలలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని, రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ అట్టి ప్రకటనలో వెల్లడించారు.
