
Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: గ్రామపంచాయతీ కార్మికుల జీతాల కోసం ప్రభుత్వం ఈ అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేక బడ్జెట్ కేటాయించకుంటే మరో పోరాటానికి సిద్ధమవుతామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శంకర్ డిమాండ్ చేశారు. ఆదివారం రోజున హుజురాబాద్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ముఖ్య నాయకులతో పత్రిక ప్రకటన విడుదల చేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 14 నెలల కాలం గడిచినప్పటికీ, గ్రామపంచాయతీ కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని అమలు చేయడం లేదని అన్నారు. అనేకమార్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, కమిషనర్ ని కలిసినప్పటికీ ఈ సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ కార్మికులకు గత రెండు నుండి ఆరు నెలలుగా జీతాలు పెండింగ్ ఉన్నాయన్నారు. కొత్త జీతాలు పెరుగుడు సంఘతినీ అటు ఉంచితే, గతంలో ఇచ్చే రూ. 9500 వేతనాలు కూడా నెల నెల చెల్లించకుండా కార్మికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. గ్రామపంచాయతీ కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ఇది సరైనది కాదని ఆయన ఆరోపించారు. వెంటనే మార్చి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక గ్రాంట్ కేటాయించి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పినట్టుగా ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రతినెల 1వ తేదీ నుండి పదవ తేదీలోపు నేరుగా కార్మికుల అకౌంట్లో ప్రభుత్వమే వేతనాలు చెల్లించాలని, అలాగే మల్టీపర్పస్ వర్కర్ విధానం రద్దు చేయాలని, ప్రతి కార్మికుడికి పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం 15 లక్షలు కల్పించాలని, 60 సంవత్సరాలు నిండిన కార్మికుని కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించి రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఐదు లక్షల రూపాయలు అందించాలని తదితర న్యాయమైన డిమాండ్ల కోసం అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ ప్రభుత్వం అయినా సమస్యలు పరిష్కారం చేస్తుందంటే పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తుందని, ఇప్పటికైనా పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించి తదితర కార్మిక సమస్యలు పరిష్కారం చేయనట్లయితే మరో పోరాటానికి గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సన్నద్ధమవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ యూనియన్ మండల గౌరవ అధ్యక్షులు కొమురయ్య, ఉపాధ్యక్షులు ఆకునూరి సుధాకర్, మొగిలి, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
