
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాజీవ్ యువ వికాసం పేరుతో శాంక్షన్ అయిన పాత ట్రైకార్ లోన్స్ ఎత్తివేస్తే తీవ్ర పరిణామాలుంటాయని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లోకిని రాజు, కూతాడి రవికుమార్ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం వారు విలేకరులతో (ఒక ప్రకటనలో) మాట్లాడుతూ..6000 కోట్లతో రాజీవ్ యువ వికాసం పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా ప్రారంభించింది. కానీ గత ప్రభుత్వంలో ఎస్టీ కార్పొరేషన్లలో వేలాది ఆదివాసి గిరిజన యువత రుణాలు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. 2019-20 సంవత్సరాల్లో స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి ఎస్టి కార్పొరేషన్ నుండి అర్హుల లిస్టును ప్రకటించాయి. గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ 30 వేల మందిని లబ్ధిదారులుగా గుర్తించి శాంక్షన్ లిస్ట్ తో పాటు219 కోట్ల రూపాయల చెక్కులను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఇస్తామని హామీ ఇవ్వడంతో లబ్ధిదారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ట్రై కార్ లోన్స్ కు సంబంధించిన వేలాదిమంది ఆదివాసి గిరిజన లబ్ధిదారుల శాంక్షన్ లిస్టు చెక్కులను రెడీ చేసి క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖకు పంపిస్తే ఇంతవరకు కూడా కోట్లాది రూపాయల బకాయిలను విడుదల చేయకుండా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయకుండానే… హడావిడిగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రవేశపెట్టడం ఎస్టీ కార్పొరేషన్లలో శాంక్షన్ అయినా లబ్ధిదారుల్లో తీవ్ర ఆందోళనకు గురవుతారని పేర్కొన్నారు.
వీరందరూ రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాల కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవడానికి కూడా తీవ్ర ఆటంకాలు ఎదురయ్య ప్రమాదం ఉన్నదన్నారు. ఎందుకంటే రుణం తీసుకోకపోయినా శాంక్షన్ అయినట్టు ఒక్కసారి ఆన్లైన్ దరఖాస్తుల్లో ఎక్కిన తర్వాత తిరిగి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నా రిజెక్ట్ అవుతుందన్నారు. దీనితో వేలాది ఆదివాసి గిరిజన యువత రాజీవ్ యువ వికాసం పథకంలో రుణాలు పొందకుండా అనర్హులుగా మారే అవకాశం ఉన్నదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల మంది యువతకు రుణాలు ఇవ్వడమే లక్ష్యంగా రాజీవ్ యువ వికాసం పేరుతో నూతన పథకాన్ని ప్రారంభించిందన్నారు. దీనికి 6వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపిందని, గతంలో యూనిట్ కాస్ట్ 10 లక్షల వరకు రుణం పొందే అవకాశం ఉండగా ఈ పథకంలో నాలుగు లక్షల వరకే రుణ సౌకర్యాలు కల్పించడం అన్యాయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఎస్టీ కార్పొరేషన్లలో పెండింగ్ లో ఉన్న రుణాలను తక్షణం విడుదల చేసి చెక్కుల రూపంలో సిద్ధంగా ఉన్న లబ్ధిదారులకు వారి ఖాతాలో జమ చేయాలన్నారు.

రాష్ట్ర అధ్యక్షుడు లోకిని రాజు

ప్రధాన కార్యదర్శి కుతాటి రవికుమార్