
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సౌజన్యంతో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల హుజురాబాద్ లో” వికసిత్ భారత్ 2047: విద్యావిధానం, భారతీయ జ్ఞానపరంపర ఏకీకరణ -ఆవిష్కరణలు & వ్యవస్థాపకత”అనే అంశంపై నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు మొదటి రోజు ముఖ్య వక్తగా హాజరైన ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వసంత్ కుమార్ సదస్సు ఉద్దేశాన్ని ఆవిష్కరించే కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సర్వశక్తి సంపూర్ణ సమ్మిళిత దేశముగా భారతదేశాన్ని ఆవిష్కరించడమే వికసిత్ భారత్ ప్రధాన ఉద్దేశం అని, ప్రతిభ ,వివేకము, విచక్షణ మరియు ఇతరులను గెలిపించడంలో నే సంతృప్తి జీవనం లభిస్తుందని, విద్యార్థులు మరియు విద్యాసంస్థలు ఎంటర్ ప్రెనూరల్ విద్యను ప్రోత్సహించినప్పుడే ఇది సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
ఏ దేశ అభివృద్ధి అయినా సాంప్రదాయ విజ్ఞానాన్ని గౌరవించినప్పుడు, సుపరిపాలన అందించినప్పుడు మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. వేద విద్య, సామాజిక చైతన్య విద్య, విద్యార్థుల ఎంపిక విద్య, గురుకుల విద్య ,ఆంగ్లేయ విద్య మరియు నేటి ఆన్లైన్ విద్య ,ఇవన్నీ కూడా సంప్రదాయ విద్యావ్యవస్థ మూలాలను కొనసాగించినప్పుడే భారతదేశం స్వయం సమ్మిళిత అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది అని, ఇందుకోసం ఇలాంటి సదస్సుల్లో అర్థవంతమైన చర్చలు మరియు విధానాల రూపకల్పనకు కావలసిన సాహిత్యాన్ని, సమాజానికి మరియు పాలకులకు దిశా నిర్దేశం చేయాలని పేర్కొన్నారు. ఈ సదస్సుకు మొదటి రోజు గౌరవ అతిథిగా విచ్చేసిన ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ప్రాచీన విద్యా విధానంలో పేర్కొనబడిన ప్రముఖు ఆవిష్కరణలు మరియు నేటి సమాజంలో వాటి ఆవశ్యకతను వివరించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇందిరాదేవి సదస్సు నిర్వాహకులను అభినందించారు.
ఈ సదస్సు నిర్వహణ కర్త డాక్టర్ కొత్తిరెడ్డి మల్లారెడ్డి సదస్సు యొక్క ఉద్దేశాలను వివరించారు. ఈ సందర్భంగా జాతీయ సదస్సు సంచికను ఆవిష్కరించారు. అలాగే “మా సామాజిక సంఘం” సంయుక్త ఆధ్వర్యంలో, మాదక ద్రవ్యాల నియంత్రణ ధ్యేయంగా సంకలనం చేసిన ‘డేగ కన్ను’ అనే కథా సంపుటిని ఆవిష్కరించారు మరియు ఈ కథల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ సింగామాని నైకర్, వెస్ట్రన్ కేఫ్ విశ్వవిద్యాలయం సౌతాఫ్రికా, ప్రొఫెసర్ నాగరాజు కేంద్ర విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఆన్లైన్ ద్వారా సదస్సును ఉద్దేశించి కీలక ఉపన్యాసం చేశారు. అనంతరము వివిధ రాష్ట్రాల నుండి సదస్సుకు హాజరైన పరిశోధకులు మరియు అధ్యాపకులు పరిశోధన పత్రాలను సమర్పించి చర్చా గోష్టి నిర్వహించారు.
ఈ సదస్సులో వివిధ కళాశాల నుండి వచ్చినటువంటి అధ్యాపకులు మరియు తెలంగాణ ప్రభుత్వ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేందర్ రెడ్డి, ప్రముఖ సాహితీవేత్తలు డాక్టర్ కృష్ణమాచార్యులు, గాజోజు నాగభూషణం, వడ్డాది రవికాంత్ శర్మ, అంబాల జనార్దన్, కళాశాల అధ్యాపకులు లింగారెడ్డి, మైపాల్ రెడ్డి, నరేందర్ రెడ్డి, రేణుక, ఝాన్సీ రాణి సుమలత, రమ, స్వప్న, పల్లవి, శ్రీధర్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.







