
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతదేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వమని, దేశంలోని విభిన్న కులాలు, మతాలవారు రాబోయే పండుగలు అన్ని కుల మతాలకు అతీతంగా స్నేహపూర్వకమైన వాతావరణంలో జరుపుకోవాలని హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హుజురాబాద్ పోలీస్ స్టేషన్లో జరిగిన పీస్ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాబోయే ఉగాది, రంజాన్, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి, పండుగలు ప్రజలంతా కలిసిమెలిసి జరుపుకోవాలని అన్నారు. హుజురాబాద్ డివిజన్ లో ప్రజలు పండుగలను కుల మతాలకు అతీతంగా జరుపుకుంటూ పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. గతంలో మాదిరిగానే కుల మతాలతో సంబంధం లేకుండా పండుగలు జరుపుకోవాలని అన్నారు. పండుగల సమయంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్నారు. పండుగల సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పలు ప్రాంతాలలో పోలీస్ పహారా కూడా ఉంటుందని తెలిపారు. ప్రజలకు పోలీసు సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ సిఐ తిరుమల్ గౌడ్, పీస్ కమిటీ సభ్యులతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




ఎసిపి శ్రీనివాస్ జి, టౌన్ సీఐ తిరుమల గౌడ్ ku రుమాల్ టోపీ పెట్టి సత్కరిస్తున్న ముస్లిం మైనార్టీ నాయకులు..