
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ (వేములవాడ),మార్చి 28: రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యల పరిష్కరానికి వెంటనే మీడియా కమీషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్)రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలతో పాటు మీడియాలో వస్తున్న అనారోగ్యకమైన భాష నియంత్రణ కు రిటైర్డ్ జడ్జీతో మీడియా కమీషన్ అవసరమని అన్నారు. శుక్రవారం వేములవాడలోని మున్నూరుకాపు సంఘం భవన్ లో జరిగిన టీడబ్ల్యూజేఎఫ్ వేములవాడ నియోజకవర్గం మహాసభలో మామిడి సోమయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలపై పోరాడుతున్న ఏకైక సంఘం టీడబ్ల్యూజేఎఫ్ అని అన్నారు. పాత్రికేయ సంఘాలు పాలకుల పక్షం ఉండకుండా ప్రజల పక్షం, పాత్రికేయుల పక్షం ఉండాలన్న లక్ష్యంతో ఫెడరేషన్ జర్నలిస్టుల పక్షాన పోరాడుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడబ్ల్యూజేఎఫ్ నెంబర్ వన్ యూనియన్ గా బలపడుతుందని అన్నారు. ఐఏఫ్ డబ్ల్యూజే కార్యదర్శి పులిపలుపుల ఆనందం మాట్లాడుతూ.. జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక ఓడిదుడుకుల మధ్య వృత్తిబాధ్యతలు నిర్వహిస్తున్నారని, చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల మాదిరిగా అమలు చేయాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని, ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసిందని, వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జర్నలిస్టులకు అండగా నిలిచే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమే అని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం పాకులాడే సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సంఘాలు జర్నలిస్టుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. టీడబ్ల్యూజేఎఫ్ ప్రజాస్వామ్యబద్దంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడే యూనియన్ అని అన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి విజయ్ కుమార్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, రాజన్న-సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ యూసుఫ్ తదితరులు పాల్గొన్నారు. ఈ మహాసభలో పలు తీర్మానాలు చేశారు. వేములవాడ నియోజకవర్గం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు వినతిపత్రం ఇవ్వాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టులకు హెల్త్ కార్డులు, అక్రిడేషన్లు ఇవ్వాలని కోరుతూ మహాసభ తీర్మానించింది.
వేములవాడ నియోజకవర్గ కమిటీ ఎన్నిక…
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ వేములవాడ నియోజకవర్గం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తొగరి కరుణాకర్, కార్యదర్శిగా సుంకరి నరేందర్, కోశాధికారిగా బోప్ప బిక్షపతి, ఉపాధ్యక్షులుగా అవధూత శ్రీధర్, కవ్వాల సురేందర్, ఎండి షరీఫ్, సహాయ కార్యదర్శులుగా గొల్లపల్లి వేణు, కోటగిరి రాజశేఖర్, గోపు ప్రవీణ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరితో పాటు చల్లా రమేష్, వాసం వెంకటస్వామి, ఎగుమంటి మూర్తి రెడ్డి, కళ్యాడపు వెంకటమల్లు, చక్రహరి దేవేందర్ రాజు, మహమ్మద్ అబ్దుల్ రఫీక్, నడిగట్ల బిక్షపతి, సయ్యద్ షబ్బీర్ లను కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.


సమావేశానికి హాజరైన జర్నలిస్టులు..





