
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శ్రీరామనవమిని పురస్కరించుకుని హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట గ్రామంలోని శ్రీ సీతారాముల ఆలయంలో సీతారాముల కల్యాణం ఘనంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ జరిగిన ఈ కల్యాణ మహోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఆయన సతీమణి శాలినిరెడ్డి కలిసి స్వామివారికి పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ దృశ్యాన్ని భక్తులతో కలిసి తిలకించారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “శ్రీరాముడు సత్యానికి, ధర్మానికి ప్రతీక. ఆయన్ను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సన్మార్గంలో నడవాలి. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వడంలో రాముని జీవితం మార్గదర్శకం” అని అన్నారు. అలాగే ఆలయ అభివృద్ధికి అవసరమైన సహాయాన్ని ప్రభుత్వం ద్వారా అందించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి అన్ని వసతులతో తీర్చిదిద్దతామని తెలిపారు.
మహోత్సవం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించగా వేలాదిగా వచ్చిన భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రమేలా సత్పతి, కరీంనగర్ సీపీ గౌస్ ఆలం, అడిషనల్ కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ఆలయ ఇంచార్జి ఈవో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.












