
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ పట్టణంలోని సూపర్ బజార్ రోడ్డులో పూలే జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఇప్పలపెల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, మున్సిపల్ మాజీ చైర్మన్లు గందె రాధిక, వడ్లూరి విజయ్ కుమార్, కొలిపాక శంకర్, మారెపెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పూలే దంపతుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలన కోసం అలుపెరుగని పోరాటం చేసిన యోధుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. స్త్రీల అభ్యున్నతికి, స్త్రీ విద్యకు మహనీయుడు పూలే ఎంతో కృషిచేశారని తెలిపారు. తొలి బాలికల పాఠశాలను ప్రారంభించిన విద్యావేత్త పూలే అని అభివర్ణించారు. సమ సమాజ స్థాపనే జ్యోతిరావు పూలే లక్ష్యమని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని అన్నారు. సమ సమాజ నిర్మాణంలో జ్యోతిరావు పూలే కీలక పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని అభివర్ణించారు. పూలే ఆశయ సాధనకు కృషి చేయడమే మనం అర్పించే ఘన నివాళి అని పేర్కొన్నారు. 19వ శతాబ్దంలోని కుల వివక్ష బాల్యవివాహాలు, స్త్రీలకు విద్యను నిరాకరించుట మొదలగు సమస్యల నుండి భారత సామాజిక వ్యవస్థను చైతన్యపరిచి తొలి సంఘసంస్కర్తగా పేరొందిన మహాత్మ జ్యోతిబాపూలే జీవిత విశిష్టతను ఈ తరం వారు తెలుసుకొని ,ప్రజలు మరియు పాలకులు ఆచరించినప్పుడే సమాజంలో సమానత్వం సాధించగలుగుతాము అని పేర్కొన్నారు. స్త్రీలకు విద్య ద్వారా మాత్రమే సాధికారత లభిస్తుందని నమ్మిన పూలే, స్త్రీ విద్య కొరకు ప్రత్యేక పాఠశాలలు నిర్వహించారు. బాలిక విద్య, వయోజన విద్య, వితంతు వివాహం మొదలగు గణనీయమైనటువంటి సామాజిక మార్పులకు పూలే శ్రీకారం చుట్టారని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పూలే జయంతి ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షులు సందెల్ల వెంకన్న, చందుపట్ల జనార్ధన్, ముప్పు శ్రీనివాస్, ఆలేటి రవీందర్, ఎర్రబోజు నారాయణ, ప్రధాన కార్యదర్శి తులసీ లక్ష్మణమూర్తి, ప్రజా సంఘాల నాయకులు వేల్పుల రత్నం, రుద్రారపు రాంచంద్రం, ఖాలీద్ హుస్సేన్, సమ్మయ్య ముదిరాజ్, వేముల పుష్పలత, సొల్లు బాబు, మూల సాయి, మార్త రవీందర్, కేఆర్ బిక్షపతి, చిలుక మారి శ్రీనివాస్, మధుకర్, ఎర్ర శ్రీధర్, ఎర్ర నాగరాజు, మాచర్ల నరేష్, మిడిదొడ్డి రాజు, శ్రీనివాస్, ఇప్పకాయల సాగర్, అమరేందర్ గౌడ్, రాంశంకర్ గౌడ్, బుర్ర కుమార్ గౌడ్, సొల్లు సునీత, చీకోటి వెంకటరమణ, రాం రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిస్తున్న నిర్వాహకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు..

సమావేశంలో మాట్లాడుతున్న మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య..



సమావేశానికి హాజరైన వివిధ సంఘాల నాయకులు, పూలే అభిమానులు..





