
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: నదీస్నానాలు, కోనేటి స్నానాలు, సముద్ర స్నానాలు, మంగళ స్నానాలు హిందువుల సాంప్రదాయం. అలాగే తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనం కూడా నీటితో ముడిపడి ఉంది. నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని పురాణ వచనం. ఇలా జీవరాశులకు ప్రధానమైన జలం ప్రాముఖ్యతను గుర్తు చేసేవే పుష్కరాలు. మానవాళికి మహోపకారిగా, మోక్ష ప్రదాయినిగా నిలుస్తున్న పవిత్ర సరస్వతీనది పుష్కరశోభను సంతరించు కుంటోంది.
బృహస్పతి మిధున రాశిలో ప్రవేశంతో అంతర్వాహిని అయిన సరస్వతీనది పుష్కరాలు ఆరంభం కానున్నాయి. 15-05-2025 నుండి 26-05-2025 వరకు 12 రోజులపాటు సరస్వతీనది పుష్కర వైభవం జగజ్జేయమానంగా వెలుగొందనుంది. పుష్కరవేళ ఆయా ప్రాంత క్షేత్రాలకు వెళ్ళి పవిత్రస్నానాలు ఆచరించి, పితృకర్మలు గావించి పునీతులు కావాలన్న సంకల్పంతో లక్షలాదిమంది భక్తులు సిద్ధం అవుతున్నారు.
“పుష్కరాలు జరిగే ప్రదేశాలు”
సరస్వతీనది ఉత్తరాఖండ్ రాష్ట్రం బద్రీనాథ్ దగ్గరలోని “మన” అనే గ్రామంలో పుట్టింది. అయితే ఈ నది అంతర్వాహిని. అందువల్ల సరస్వతి నదీ పుష్కరాలు “మన”లో జరుగుతాయి. అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమంలోను, రాజస్థాన్ రాష్ట్రంలోని పుష్కర్ లోను, గుజరాత్ రాష్ట్రంలోని సోమనాథ్ త్రివేణి సంగమంలోను జరుగుతాయి. మన తెలంగాణా రాష్ట్రంలోని కాళేశ్వరంలోని త్రివేణీ సంగమంలోను సరస్వతీనదీ పుష్కరాలు జరుగుతాయి.






