
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ మే 16: దేశీ గో వంశరక్షణ సంవర్ధన సమితి – తెలంగాణ గోరక్ష విభాగం తరఫున, విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హుజురాబాద్ మండలంలో గోవధ నిరోధానికి సంబంధించి అధికారులకు వినతిపత్రం సమర్పించబడింది. ఈ సందర్భంగా మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో)సర్కిల్ ఇన్స్పెక్టర్ (సిఐ)లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గోరక్ష రాష్ట్ర కమిటీ సభ్యుడు ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మండలంలో గోవులను వధించే వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలి,అని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిషేధించబడిన గోవధశాలను తక్షణమే మూసివేయాలని, ఆక్రమిత గోచర భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు.
బక్రీదు సందర్భంలో గోమాత రక్షణకు సమాచారాన్ని అందించే గోరక్షకులకు రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పత్రాలు జారీ చేయాలని సూచించారు. రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ,గోమాతను వేదకాలం నుంచే ఆరాధనగా భావిస్తూనే వచ్చాము. గోవు వ్యవసాయం, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా నిలుస్తోంది. అయినప్పటికీ, విచ్చలవిడిగా గోవులను వధించడం దురదృష్టకరం. వేలాది టన్నుల గోమాంసం విదేశాలకు ఎగుమతి అవుతోంది,అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
1977లో అమలులోకి వచ్చిన గోవధ నిషేధ చట్టం తెలంగాణలోనూ అమలులో ఉందని గుర్తు చేస్తూ, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 48 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి గోరక్ష బాధ్యతగా ఉందన్నారు. కానీ అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు కళ్లెపూ సుధాకర్ రావు, మండల అధ్యక్షుడు కంకణాల రమేష్ రెడ్డి, టౌన్ సెక్రటరీ కనకం శ్రీనివాస్, కార్యకర్తలు మధుకర్ రెడ్డి, ప్రవీణ్, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సిఐ కరుణాకర్ కు వినతి పత్రం అందజేస్తున్న విహెచ్పి నాయకులు