
Oplus_131072
– ఎస్సై భార్గవ్ అరాచకం పై విచారణ జరిపించాలి -తిప్పారపు సంపత్ టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇంచార్జ్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈ రోజు హుజురాబాద్ ఏసిపి శ్రీనివాస్ జీని వివిధ దళిత ప్రతినిధులు మహేందర్ పై దాడి గురించి పూర్తిగా వివరాలు వివరిస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. అనంతరం టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ అడ్రసిటీ రాష్ట్ర ఇంచార్జ్ తిప్పారపు సంపత్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎంత పటిష్టంగా పనిచేస్తున్న ఇలాంటి పోలీస్ అధికారుల లోపం చాలా స్పష్టంగా కనబడుతుందన్నారు. ప్రజలకు పోలీసులు అంటే గౌరవం ఉండాలి కానీ పోలీసులంటే భయం ఉండకూడదని, అందుకే ఈ ప్రభుత్వాలు ఫ్రెండ్లీ పోలీస్ పెట్టాయని దాన్ని మరచి ఒక నియంతలాగా ప్రవర్తిస్తూ చట్టాన్ని ఉల్లంఘించి రాజ్యాంగాన్ని పూర్తిగా విస్మరించి ఒక సైకోలా ప్రవర్తించిన ఎస్సై భార్గవ్, కానిస్టేబుల్ ఆకాష్ రెడ్డి, రవికుమార్ పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. స్వతంత్రం వచ్చి సంవత్సరాలు గడిచిన కూడా దళితులకు ఇంకా స్వేచ్ఛ లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. దళితులు ఆత్మగౌరవంతో బ్రతకాలంటే ఇలాంటి వ్యక్తుల చేతుల్లో దెబ్బలు పడవలసిందేనా అని అన్నారు. దళితులను రక్షించవలసిన పోలీసులే భక్షకులుగా మారి విపరీతంగా కొడితే రెండు చెవుల కర్ణబేరులు పగలడం జరిగిందన్నారు. మహేందర్ ప్రాణానికి ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు, తన కుటుంబాన్ని ఎవరు పోషిస్తారు అని ఈ సందర్భంగా నిలదీశారు. సిపి వెంటనే చొరవ తీసుకొని పూర్తిస్థాయిలో విచారణ జరిపించి చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితుడు బత్తుల మహేందర్ కు న్యాయం జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు రుద్రారపు రామచంద్రంమాదిగ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామిమాదిగ, రాష్ట్ర అధికార ప్రతినిధి మారపల్లి శ్రీనివాస్ మాదిగ, మహాజన సోషలిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకులు రేణిగుంట్ల సాగర్, మహాజన సోషలిస్ట్ పార్టీ జిల్లా అధ్యక్షులు తునికి వసంత్ తదితరులు పాల్గొన్నారు.
