
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: సమాజానికి మంచి చేయాలనే సంకల్పం నేటి మనుషుల్లో పెంపొందించడానికి వికాస తరంగిణి ముందుకు వెళుతుందని త్రిదండి శ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి అన్నారు. గురువారం రాత్రి హుజురాబాద్ పట్టణంలోని శ్రీ సీతారామచంద్రస్వామి ధ్వజస్తంభ ఉత్సవ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. యాగశాలలో ఆయన హోమం నిర్వహించి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం భక్తులతో ఆయన మాట్లాడుతూ…. నేటి విద్య యాంత్రికంగా ఉంటుందని అలాంటి విద్య వల్ల యంత్రాలాంటి మనుషులే తయారవుతున్నారు కానీ… మనసున్న మనుషులు తగ్గిపోతున్నారని అన్నారు. అలాంటి మనసున్న మనుషులను తయారు చేయడానికి వికాస తరంగిణి పిల్లల నుండే మంచి భావాలను మంచి ఆలోచనలను పెంపొందించే అనేక కార్యక్రమాలను రూపొందిస్తుందని అన్నారు. సమాజంలో, కుటుంబంలో మహిళల పాత్ర ఎంతో ఉన్నతమైనదని ఉత్కృష్టమైనదని అలాంటి మహిళలకు ఉన్నతమైన స్థానాన్ని ప్రతి ఒక్కరు అందించాలని అలాంటి అభిప్రాయాలను పెంచాలని అన్నారు. హుజురాబాదులో వికాస తరంగిణి ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిన ఈ ప్రాంత మేధావులు విద్యావంతులు అభినందనీయులని అన్నారు. అంతకుముందు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… స్వామి వారి ఆశీస్సులతో తాను ఉన్నత పదవులు పొందానని ఆయన దీవెనలు తోనే ముందుకు సాగుతున్నానని అన్నారు. ఆయన చూపిన మార్గంలో తాను నడుచుకుంటానని ఆయన అన్నారు. అంతకుముందు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా నుండి జీయర్ స్వామికి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డితో పాటు పట్టణ ప్రజాప్రతినిధులు, ప్రజలు, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సతీమణి శాలిని రెడ్డి, కుటుంబ సభ్యులు, న్యాయమూర్తి సంధ్యారాణి వికాస తరంగిణి జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాధాకృష్ణ, ఆలయ చైర్మన్ క్యాస చక్రధర్, పుల్లూరి ప్రభాకర్ రావు, వర్దినేని రవీందర్రావు, గందె శ్రీనివాస్, కొలిపాక శ్రీనివాస్, శ్రీధర్ ఆచార్యులు, నిఖిలాచార్యులు, ఆలయ కమిటీ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.








హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ఘనస్వాగతం పలకగా.. వాహనంలో వస్తున్న చిన్న జీయర్ స్వామి.. ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్టకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న చిన్న జీయర్ స్వామి.. భక్తులను ఉద్దేశించి మాట్లాడుతున్న జీయర్ స్వామి, పక్కన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తదితరులు.
