
– హర్షం వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట): పదేళ్ల నిరీక్షణ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పేదలకు పంచుతుంటే వారి నుండి అనూహ్య స్పందన వస్తుందని, పేదవారి సొంతింటి కల గతంలో కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైందని మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెరవేరుస్తున్నామని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం రోజున జమ్మికుంట పట్టణ పరిధిలోని 24, 19, 1, 2వ వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ కార్యక్రమం ఆయన స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. లబ్దిదారులకు పట్టాలు ఇస్తున్న క్రమంలో వారు కొంత భావోద్వేగానికి లోనయ్యారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గంలో ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదని,గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లు మాత్రమే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయని, మళ్ళీ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సొంతింటి కల నెరవేరుతుందని అన్నారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని, చేసేదే చెప్తుందని సోషల్ మీడియాలో గొప్పలు చెప్పుకునే నాయకులు నియోజకవర్గంలో ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విడతల వారిగా అర్హుడైన ప్రతి లబ్దిదారులకు పథకాలు అందజేస్తామని, రేషన్ కార్డులు, ఉచిత విద్యుత్, సన్న బియ్యం, ఉచిత బస్ రవాణా సౌకర్యం లాంటి సంక్షేమ పథకాలు ప్రజాదరణ పొందాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ, మండల, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.





జమ్మికుంట పట్టణ పరిధిలోని 24, 19, 1, 2వ వార్డులలో ఇందిరమ్మ ఇళ్ల పట్టా పంపిణీ చేస్తున్న కాంగ్రెస్ నేత వోడితల ప్రణవ్





