
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ జూన్ 03: కరీంనగర్ రూరల్ పోలీస్లు బావుపేట గ్రామంలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని పట్టుకున్నారు. అతని దగ్గర నుంచి 1 కిలో 200 గ్రాముల గంజాయి స్వాధీనం చేశారు. బావుపేటలోని రాంరెడ్డి చికెన్ సెంటర్ దగ్గర నల్ల కవర్తో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఉన్న బ్యాగ్ తనిఖీ చేయగా, గంజాయి వాసన వస్తున్న పువ్వులు, మొగ్గలు లభించాయి. అతని పేరు రాంపర్వేష్ సాయిని (వయసు 46) అని, బీహార్కు చెందినవాడని గుర్తించారు. కొన్ని నెలలుగా బావుపేటలో గ్రానైట్ కంపెనీలో కూలీగా పని చేస్తున్నట్టు చెప్పారు. గంజాయి అలవాటు ఉన్న వాళ్లకి ఇది అమ్మి డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో బీహార్ నుంచి తక్కువ ధరకు గంజాయి తెచ్చుకుని, చిన్న ప్యాకెట్లుగా తయారుచేసి ఒక్కో ప్యాకెట్ను రూ. 500కి అమ్ముతున్నట్టు అంగీకరించారు. పట్టుబడిన సమయంలో అతను గంజాయి అమ్మేందుకు అక్కడే ఎదురుచూస్తున్నట్టు వెల్లడించాడు. అధికారులు ప్రభుత్వ సాక్షుల సమక్షంలో పంచనామా నిర్వహించి గంజాయి తూకం వేయగా 1.2 కిలోల గంజాయి ఉందని తేలింది. అతని సెల్ఫోన్ కూడా స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసి, నిందితుడిని కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపనున్నారు.
