
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్
హుజురాబాద్, జూన్ 09: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, “బడిబాట” కార్యక్రమం కింద ఉపాధ్యాయులు హుజురాబాద్ పట్టణంలోని గాంధీనగర్, ప్రతాపవాడలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని తల్లిదండ్రులకు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటుబుక్కులు, స్కూలు యూనిఫామ్లు, షూస్తో పాటు మధ్యాహ్న భోజనం అందిస్తారని ఉపాధ్యాయులు తెలిపారు. అంతేకాకుండా, పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తూ, నిపుణులైన ఉపాధ్యాయులచే విద్యాబోధన జరుగుతోందని స్పష్టం చేశారు.
ఈ ప్రచారంలో భాగంగా, 2 నుండి 5 సంవత్సరాలలోపు పిల్లలను సమీపంలోని అంగన్వాడీ పాఠశాలల్లో చేర్చాలని, 5 సంవత్సరాలు పైబడిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని ఉపాధ్యాయులు తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు కవిత, సమ్మయ్య, అంగన్వాడీ టీచర్లు కే జ్యోతి రాణి, రసీదా, రాణి, శోభారాణి, స్వర్ణలత, తిరుమల తదితరులు పాల్గొన్నారు.


గాంధీనగర్ లో బడిబాట ర్యాలీ నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు.

ప్రతాపవాడలో ఇల్లు ఇల్లు తిరుగుతున్న ఉపాధ్యాయులు..