
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని జమ్మికుంట పోలీస్ స్టేషన్ను మంగళవారం కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌష్ ఆలం ఐపీఎస్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ ఏసీపీ మాధవి మరియు ఇన్స్పెక్టర్ రామకృష్ణ గౌడ్ పూల మొక్కను అందించి కమీషనర్కు స్వాగతం పలికారు. అనంతరం సాయుధ దళ పోలీసుల గార్డు అందించిన గౌరవ వందనం స్వీకరించారు.
పోలీస్ స్టేషన్ హాజరు ఉన్న సిబ్బంది పరేడ్ను పర్యవేక్షించి, పరిసరాలను పరిశీలించారు. సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి, కేటాయించబడిన రెయిన్జాకెట్ వంటి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు.
పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన మరియు రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన 14 సీసీ కెమెరాలను పోలీస్ కమీషనర్ ప్రారంభించారు. ఈ కెమెరాలన్నీ పోలీస్ స్టేషన్లోని కమాండ్ కంట్రోల్ రూమ్కు అనుసంధానించబడి, 24 గంటలపాటు రికార్డు అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని చోట్ల సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతామని జమ్మికుంట ఇన్స్పెక్టర్ రామకృష్ణ వెల్లడించినట్లు కమీషనర్ తెలిపారు. కెమెరాల ఏర్పాటుకు కృషి చేసిన ఇన్స్పెక్టర్ రామకృష్ణను పోలీస్ కమీషనర్ ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. హాజరులో ఉన్న సిబ్బందితో మాట్లాడి, వారికి కేటాయించిన విధులు, రికార్డుల నిర్వహణ, సీసీటీఎన్ఎస్ (CCTNS)లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచాలని సూచించారు.
తెలంగాణ పోలీసులు వినియోగించే సీసీటీఎన్ఎస్ – 2.0, పిటిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్, ఈ-సమన్ల జారీ, టీఎస్-కాప్, హెచ్ఆర్ఎంఎస్, ఈ-సాక్ష్య, టెక్ డాటం, ఐరాడ్ దర్పణ్, సీఈఐఆర్, సైబర్ క్రైమ్లో ఆర్థిక, ఆర్థికేతర నేరాలు, సీడీఆర్, పోర్టబుల్ ఫింగర్ ప్రింట్ డివైస్, బాడీ వార్న్ కెమెరాలు వంటి అన్ని రకాల సాఫ్ట్వేర్ అప్లికేషన్లపై పూర్తి స్థాయిలో పట్టు సాధించి, వాటిని రోజువారీ విధుల్లో విరివిగా వినియోగించాలని ఆదేశించారు.
ఎఫ్.ఐ.ఆర్ ఇండెక్స్ను పరిశీలించి, పెండింగ్ కేసులపై సమీక్ష జరిపారు. వాటికి గల కారణాలను తెలుసుకొని, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. నమోదైన సైబర్ నేరాల గురించి తెలుసుకొని, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. రామడుగు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలను సెక్టార్లుగా, సబ్-సెక్టార్లుగా విభజించి, వాటికి గ్రామ పోలీస్ అధికారులను కేటాయించాలని ఆదేశించారు.
నూతనంగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్లో అన్ని రకాల విధులను సక్రమంగా నేర్చుకోవాలన్నారు. రికార్డు నిర్వహణ, సీసీటీఎన్ఎస్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, బీట్, పెట్రోలింగ్, సమన్లు వంటి విధులను సీనియర్ల ద్వారా తెలుసుకోవాలని సూచించారు. నిజాయితీ, క్రమశిక్షణ, సమయపాలన తప్పనిసరని తెలిపారు.
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ప్రతి నెలా వారికి సంబంధించిన నూతన సమాచారం ఎప్పటికప్పుడు సేకరించి నమోదు చేసుకోవాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఏసీపీ వి మాధవి, జమ్మికుంట టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణలతో పాటు ఇతర అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

పూల మొక్క సిపికి అందజేసి స్వాగతం పలుకుతున్న ఏసిపి మాధవి..

పూల మొక్క అందజేసి స్వాగతం పలుకుతున్న జమ్మికుంట టౌన్ సిఐ రామకృష్ణ గౌడ్..

గౌరవ వేతనం స్వీకరిస్తున్న సిపి గౌడ్ ఆలం ..

సీసీ కెమెరాలు ప్రారంభించి పరిశీలిస్తున్న సిపి.. ఏసిపి..


వివిధ పనిముట్లని పరిశీలిస్తున్న సిపి..

అనంతరం విలేకరులతో మాట్లాడుతున్న సిపి పక్కన ఏసిపి మాధవి, సిఐ రామకృష్ణ గౌడ్..