
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట),జూన్ 28: యువతను బలితీసుకుంటున్న మోసపూరితమైన ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ ల ముఠాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపాలని వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు డిమాండ్ చేశారు. జమ్మికుంట మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన గుత్తికొండ అఖిలేష్ (23) రెండు రోజుల క్రితం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని శనివారం వన్నాల శ్రీరాములు పరామర్శించారు.
శ్రీరాములపల్లెకు చెందిన గుత్తికొండ కనకలక్మి-రాజయ్యకు దంపతులకు ఇద్దరు కుమారులు కాగా పెద్ద కుమారుడు ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా చిన్న కుమారుడు గుత్తికొండ అఖిలేష్ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. కొన్ని సబ్జెక్టులు పాస్ కాకపోవడంతో ఇంటివద్ద ఉండి ప్రిపేర్ అవుతున్నాడు. కాగా గురువారం ఉదయం గుత్తికొండ అఖిలేష్ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.గుత్తికొండ అఖిలేష్ ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ ల భారిన పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇదిలావుండగా పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కుటుంబంలో చేతికి వచ్చిన యువకుడు ఈ విధంగా ఆత్మహత్య చేసుకోవడం విచారకరం అని వన్నాల శ్రీరాములు అన్నారు.ఈ సందర్భంగా వన్నాల మాట్లాడుతూ యువత అత్యాశకు పోయి ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ ఆడి ఆర్థికంగా సర్వం కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని అన్నారు. యువత ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్స్ కు అలవాటుపడకుండా దూరంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ఎక్కువగా యువత డ్రగ్స్,మారక ద్రవ్యాలకు,ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ లకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్ లైన్ బెట్టింగ్ గేమ్ ల భారిన పడిన యువత ఆత్మహత్యలు చేసుకోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ప్రకటించి భరోసా కల్పించాలని వన్నాల కోరారు.
యవత తమ విలువైన ప్రాణాలను తీసుకొని కన్న తల్లి తండ్రులకు కడుపు కోత మిగల్చవద్దని వన్నాల పిలుపు నిచ్చారు. యువకులను ఆకర్షించి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న ఆన్ లైన్ బెట్టింగ్ యాప్ ల నిర్వాహకులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కు పాదం మోపాలని వన్నాల సూచించారు. బెట్టింగ్ యాప్ ల ద్వారా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు తిరిగి డబ్బులు ఇప్పించాలని వన్నాల డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు పాల్పడిన గుత్తికొండ అఖిలేష్ కుటుంబ సభ్యులను వన్నాల ఓదార్చారు. ఆయన వెంట తెలంగాణ ఆన్ లైన్ మీడియా వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి, ఢీంబాయ్ టీవీ సీఈవో వేముల సదానందం నేత ఉన్నారు.

శ్రీరాములపల్లెలో మృతుని తల్లిదండ్రులు గుత్తికొండ కనకలక్మి-రాజయ్యలను రామర్షిస్తున్న వర్ధన్నపేట మాజీ శాసన సభ్యులు వన్నాల శ్రీరాములు..





