
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, జూన్ 30: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిన వారికి మెటీరియల్ ధరలు తగ్గించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాటూరి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదలపై ఎంతో ప్రేమతో, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయగా ఇండ్ల నిర్మాణ దారులకు వ్యాపారులు పెంచిన మెటీరియల్ ధరలతో బెంబేలెత్తిపోతున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ధరలను నియంత్రించడం, భవన నిర్మాణ మేస్త్రీలను సమయ పాలన పాటించేలా, వారీ కూలీ విషయంలో తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. తాపీ మేస్త్రీలు, కూలీలు అరకొరగా పని చేస్తూ సమయపాలన పాటించకుండా గృహ నిర్మాణ దారులను ఆర్థిక నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. మేస్త్రీలు, కూలీలు నిర్ణీత సమయం ప్రకారం పనిచేసేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన విధంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం విజయవంతం కావాలంటే లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ సామాగ్రి ధరలను తగ్గించి వారికి ఎదురయ్యే ఇసుక కొరత, ఇటుక కొరత, సిమెంట్ కొరత, సలాక కొరత, వాటిపై అధిక ధరలను తగ్గించి ఇతర బాధలను అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేసి ఇందిరమ్మ లబ్ధిదారుల బాధలు తీర్చాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల సమస్యలను అర్థం చేసుకొని సకాలంలో పరిష్కరించి లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ముదిరాజ్ సంఘం నాయకులు గట్టు సదానందం, ఐలవేణి రవీందర్, రెడ్డి సంక్షేమ సంఘం నాయకుడు గుడి మల్లారెడ్డి, రైతు సంఘం నాయకుడు మూగల సమ్మిరెడ్డి, ఎమ్మార్పీఎస్ నాయకుడు పోచంపల్లి సురేందర్, వైద్యుల మహేందర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

విలేకరులతో మాట్లాడుతున్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్..





