
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కోతుల బారినపడి గాయాల పాలై చికిత్స పొందుతున్న తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగి బూర సుదర్శన్ గురువారం మృతి చెందారు. గత నెల రోజుల క్రితం తన ఇంటి వద్ద కోతులు దాడి చేసి కుడికాలును తీవ్రంగా కరిచాయి. గాయం సెప్టిక్ కావడంతో వరంగల్ ఏంజీఎం ఆసుపత్రిలో 20 రోజులుగా వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఈ రోజు ప్రాణాలు కోల్పోయారు. సుదర్శన్ హుజూరాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. మృత దేహాన్ని తహసిల్దార్ కనుకయ్య సందర్శించి పూల మాల వేసి నివాళులర్పించారు. అంత్యక్రియలకు తక్షణసాయంగా పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేసి ప్రభుత్వపరంగా ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు కృషి చేస్తానన్నారు. కాగా ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కోతుల వల్లే తమ కుటుంబ పెద్దను కోల్పోయామని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
కోతుల నిర్మూలనలో బల్దియా అధికారుల నిర్లక్ష్యం..!
హుజురాబాద్ పట్టణ ప్రాంతంలో కోతుల బెడద రోజురోజుకు పెరిగిపోతున్నా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. ప్రతి వీధిలోనూ, ప్రతి ఇంటిలోనూ కోతుల బీభత్సం కొనసాగుతుండగా… ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కోతుల దాడి వల్ల పలువురు తీవ్రంగా గాయపడి అంగవికలురుగా మారుతున్న ఇల్లు పీకి పందిరేస్తున్న బల్దియా అధికారులు నిమ్మకు నీరు ఎత్తినట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు దారి తీస్తుంది. ఇప్పటికైనా కోతులను జన వాసాల నుండి అడవి ప్రాంతాలకు తరలించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

కోతుల దాడిలో గాయపడి చికిత్స పొందు మృతి చెందిన రెవెన్యూ ఉద్యోగి సుదర్శన్..

కోతుల దాడిలో గాయపడి కుడికాలు ఇన్ఫెక్షన్ అయిన దృశ్యం..

సుదర్శన్ మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పిస్తున్న తహసిల్దార్ కనకయ్య, రెవెన్యూ ఉద్యోగులు..





