
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సెప్టెంబర్ 5న జరగనున్న వినాయక నిమజ్జన కార్యక్రమం ఏర్పాట్లను శుక్రవారం హుజురాబాద్ పట్టణ శివారులోని కరీంనగర్ రోడ్డులో గల ఎస్సారెస్పీ కెనాల్ వద్ద అధికారులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ టౌన్ సిఐ టి కరుణాకర్ మాట్లాడుతూ…వినాయక విగ్రహాల నిమజ్జనము కొరకు వచ్చే భక్తులకు ఎలాంటి అవాంతరాలు కలగకుండా, ప్రశాంతమైన ఆహ్లాదకరమైన పండుగ వాతావరణంలో వినాయక విగ్రహాల నిమజ్జనమును చేయుటకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మునిసిపల్ కమిషనర్ కేంసారపు సమ్మయ్య మాట్లాడుతూ…. నిమజ్జనం సందర్భంగా మున్సిపల్ ఆధ్వర్యంలో అన్ని రకాల ఏర్పాట్లను నిమజ్జన ప్రదేశంలో ఏర్పాటు చేయనున్నట్లు దీనికి తోడు పట్టణంలోని పలు వీధుల్లో నిమజ్జన వాహనాలు వెళ్లడానికి రోడ్లను బాగు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, ఫైర్, ఎస్సారెస్పీ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పనులు చేపట్టాలని నిర్ణయించారన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఈఓ విజయేందర్ రెడ్డి, లీడింగ్ ఫైర్ మాన్ సురేందర్, మున్సిపల్ మేనేజర్ ఆర్. భూపాల్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ డి కిరణ్, సీనియర్ సహాయకులు ఇల్లందుల రమేష్, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పి. వినయ్, సానిటరీ జవాన్లు రోంటాల సుధీర్, ప్రతాప రాజు, టి కుమారస్వామి, పి అనిల్ మరియు ఇతర పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.



గణేష్ నిమజ్జనానికి ఎస్సారెస్పీ కాలువ వద్ద పరిశీలిస్తున్న సీఐ కరుణాకర్, కమిషనర్ సమ్మయ్య, ఎస్సారెస్పీ అధికారులు, ఫైర్ అధికారులు, వైద్యా ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు..





