
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా, హుజురాబాద్ మండలం, చెల్పూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో జయన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. దాదాపు 250 మందికి పైగా ప్రజలు ఈ శిబిరంలో పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ శిబిరానికి హైదరాబాద్లోని శంకర ఐ హాస్పిటల్ వైద్య నిపుణులు సహకారం అందించారు.
ఈ సందర్భంగా జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గుడిపాటి సరిత జయపాల్ రెడ్డి మాట్లాడుతూ.. మానవ శరీరంలో కళ్లు అత్యంత విలువైన భాగాలని, వాటి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చూపు మందగిస్తే ఇతరులపై ఆధారపడాల్సి వస్తుందని, అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు కంటి సమస్యలు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాలని ఆమె ప్రజలకు హితవు పలికారు.
ఈ శిబిరంలో కంటి శుక్లాలు ఉన్నవారిని గుర్తించి, వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించేందుకు హైదరాబాద్ శంకర ఐ హాస్పిటల్కు తరలిస్తామని ఆమె తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగ పడతాయని అన్నారు. గతంలో తమ ఫౌండేషన్ ద్వారా ఆపరేషన్ చేయించుకున్న వారు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని, వారు చెల్పూర్ గ్రామ ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారని శ్రీమతి సరిత వివరించారు. కంటి సమస్యలు ఉన్నవారికి వైద్యులు పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. కంటి పరీక్షలు చేయించుకున్న ప్రజలు జయన్న ఫౌండేషన్ మరియు శంకర ఐ హాస్పిటల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం పట్ల గ్రామ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని జయన్న ఫౌండేషన్ ప్రకటించింది.



ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేషంగా తరలివచ్చిన చేల్పూర్ ప్రజలు..

వైద్య శిబిరాన్ని పర్యవేక్షిస్తున్న జయన్న ఫౌండేషన్ నిర్వాహకులు గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి..





