
స్వర్ణోదయం ప్రతినిధి, హనుమకొండ: సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్తో కలిసి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
వరంగల్ నగరంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ (సీజీహెచ్ఎస్) వెల్నెస్ సెంటర్ స్థాపనకు కృషి చేస్తున్న వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య గురువారం స్వయంగా క్షేత్రస్థాయిలో భవనాలను పరిశీలించారు.
ఇటీవల కలెక్టర్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ సంబంధిత అధికారులతో పలు భవనాలను పరిశీలించి, ఎంపిక చేసిన భవనాల వివరాలను ఎంపీ డా. కావ్య హైదరాబాదులోని CGHS అడిషనల్ డైరెక్టర్ రోహిణికి తెలియజేస్తూ, సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనాల ఎంపికను త్వరితగతిన పూర్తి చేయాలని సీజీహెచ్ఎస్ డైరెక్టర్కి సూచించారు. ఈ క్రమంలో గురువారం సీజీహెచ్ఎస్ అడిషనల్ డైరెక్టర్ రోహిణి హనుమకొండ చేరుకుని ఎంపీ డా. కడియం కావ్యతో కలిసి పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. హనుమకొండలోని కాజీపేట డివిజన్ మున్సిపల్ కార్యాలయం, దూరదర్శన్ కార్యాలయంతో పాటు వసతి గృహం, వరంగల్ పాత కలెక్టర్ వసతి గృహం, కుడా కార్యాలయాలను సందర్శించి వాటి స్థితిగతులు, సౌకర్యాలు, విస్తీర్ణం వంటి వివరాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎంపీ డా. కావ్య అధికారులు, ఇంజనీర్లతో కలిసి సెంటర్కు అవసరమైన మౌలిక వసతులపై చర్చించారు. భవనం ఎంపిక ప్రక్రియను తక్షణం పూర్తి చేసి సెంటర్ ప్రారంభానికి చర్యలు తీసుకోవాలని CGHS అధికారులకు ఎంపీ డా.కడియం కావ్య సూచించారు. తరువాత హనుమకొండలోని కనకదుర్గ కాలనీలోని ఎంపీ కార్యాలయంలో పెన్షనర్లు డా. కడియం కావ్యను కలిసి సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ మంజూరుకు చేస్తున్న కృషికి కృతజ్ఞతలు తెలిపారు. వెంటనే భవనాల పరిశీలనకు CGHS డైరెక్టర్ తో ముందడుగు వేయడంపై ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో డిఎం హెచ్ ఓ డా.అప్పయ్య, CGHS అధికారులు, ఇతర అధికారులు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సంపత్ రావు, విజయ వడ్నాల, వేణుగోపాల్ రావు, మక్బుల్ హుస్సేన్, సుదర్శన్ రెడ్డి, ఎజాస్ ఉల్లా, హుస్సేన్, సీతారామారావు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ కావ్యకు పుష్పగుచ్చాలు ఇచ్చి స్వాగతం పలుకుతున్న అధికారులు..


సీజీహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ కోసం భవనాలను పరిశీలించిన అనంతరం వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎంపీ కడియం కావ్య..





