
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఓసి కులాల్లోని పేదలకు కేంద్రం కల్పించిన 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పకడ్బందీగా అమలుకు ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక జాతీయస్థాయి కమిషన్ ఏర్పాటు చేయాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
ఇదే డిమాండ్ తో ఓసి జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 19న వరంగల్ లో ఓసి సామాజిక వర్గీయులతో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తామని, రాష్ట్ర రెడ్డి, వెలమ, వైశ్య, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సంఘాల నాయకులు తాజా మాజీ ప్రజాప్రతినిధులు హాజరయ్యే ఈ సమావేశానికి రెడ్డి, వైశ్య, వెలమ, బ్రాహ్మణ, కమ్మ, మార్వాడి సామాజిక వర్గీయులు భారీ ఎత్తున తరలి రావాలని బుధవారం కరీంనగర్ లో ఓసి సమాఖ్య నిర్వహించిన సన్నాహక సమావేశంలో పోలాడి రామారావు పిలుపునిచ్చారు.
ఈడబ్ల్యూఎస్ పేదలకు విద్యా ఉద్యోగాల్లో కేంద్రం కల్పించిన 10 శాతం రిజర్వేషన్ల పకడ్బందీగా అమలు చేయుటకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈడబ్ల్యూఎస్ పేదలకు వర్తింప జేయుటకు చట్ట బద్ధతతో కూడిన జాతీయ, రాష్ట్ర ఈడబ్ల్యూఎస్ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు ఏర్పాటుకు తక్షణమే ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు.
స్ధానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ కేటగిరిలో కేటాయించిన స్థానాల్లో ఓసిలతో పాటు ఓసీయేతరులు సైతం పోటీ పడుతున్న నేపథ్యంలో ఓసి వర్గీయులకు అవకాశాలు దక్కక తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓసిలకు కూడా స్ధానిక సంస్థల ఎన్నికల్లో కనీసం 6 శాతంతో ప్రత్యేక స్థానాలు రిజర్వు చేయాలని రామారావు డిమాండ్ చేశారు.
తాము ఏ యితర సామాజిక వర్గాల వారికి వ్యతిరేకం కాదని
అన్ని కులాల సామాజిక వర్గాల వారికి ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ఓసి సమాఖ్య ధ్యేయమని ఇందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని పోలాడి రామారావు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా, రాష్ట్ర ఓసి సమాఖ్య ముఖ్య నాయకులు కంకణాల వీరారెడ్డి, దడియాల వెంకటేశ్వరరావు, తాటిపల్లి రాజన్న, చేన్నాడి మయిపాల్ రెడ్డి, డాక్టర్ దీపక్ బాబు, వేముల సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు






