
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధత కారణంగానే సుప్రీంకోర్టులో 42 శాతం బీసీ రిజర్వేషన్ల SLP డిస్మిస్ అయ్యిందనీ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డా. వకుళాభరణం కృష్ణమోహన్రావు ఆరోపించారు. గురువారం నాంపల్లిలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ ఛైర్మన్, బీజేపీ నేత డా. వకుళాభరణం కృష్ణమోహన్రావు రాష్ట్ర ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ తొందరపాటు చర్యల కారణంగానే సుప్రీంకోర్టులో వేసిన SLP చివరికి డిస్మిస్ అయ్యిందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాల్సిన ప్రభుత్వమే, న్యాయస్థానాలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం ఆందోళనకరమని అన్నారు. ఈ చర్యల కారణంగా సుప్రీంకోర్టు ద్వారాలను రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మూసివేసినట్లు అయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు ఇప్పటికే రాష్ట్ర హైకోర్టులో నిర్దిష్ట సమాధానాలు ఇచ్చి, నిజాయితీని నిరూపించుకోవాల్సిన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించి, సుప్రీంకోర్టు ద్వారాలను తట్టడం ద్వారా తన అసమర్ధతను బహిర్గతం చేసుకుందని ఆయన విమర్శించారు. బీసీ రిజర్వేషన్లకు ప్రతి దశలో అండగా, మద్దతుగా నిలిచిన బీజేపీపై ప్రభుత్వం ఆరోపణలు చేయడం, తమ అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికే పరిమితమని డా. వకుళాభరణం వ్యాఖ్యానించారు.
బీసీల హక్కులను కాపాడడం ప్రభుత్వ ప్రధాన ధర్మం కాగా, ఆ బాధ్యతను పక్కనబెట్టి బీజేపీపై అనవసర విమర్శలు చేయడం అత్యంత హేయమని వకుళాభరణం అన్నారు. ప్రతి సందర్భంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి మద్దుతుగా నిలుస్తున్న బీజేపీ పై అనుచితమైన వ్యాఖ్యలు చేయడం రేవంత్ ప్రభుత్వానికే చెల్లిందని ఆయన వ్యాఖ్యానించారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత తొలిసారిగా జనాభా గణనలో కులగణనను చేపడుతున్న ఏకైక జాతీయ ప్రభుత్వంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చరిత్రపుటలలో నిలబడబోతున్నదని ఆయన అన్నారు. గడిచిన 70 ఏండ్లలో సుదీర్ఘంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బీసీల అభివృద్ధికి ఏమీ చేయలేకపోయిందని ఆయన విమర్శించారు. ఇలాంటి పార్టీ బీజేపీ పార్టీని విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఆయన అన్నారు.
రేవంత్ ప్రభుత్వానికి నిజంగా బీసీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉంటే, 42 శాతం చట్టబద్ధంగా నిలబడటానికి కావాల్సిన అన్ని చర్యలను చేపట్టి విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను అమలు చేయాలని వకుళాభరణం డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన డిమాండ్లు :
1. సుప్రీంకోర్టు సూచనలను వెంటనే అమలు చేయాలి.
2. హైకోర్టులో గడువులోగా అవసరమైన పత్రాలు, నివేదికలు సమర్పించాలి.
3. పబ్లిక్ డొమైన్ లో డెడికేటెడ్ కమిషన్, సిపెక్ సర్వే నివేదిక, జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ నివేదికల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, ప్రజాస్వామ్య విధానంలో పారదర్శకతతో ముందుకు సాగాలి అని పేర్కొన్నారు.


మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వకలాభం కృష్ణమోహన్ రావు..






