
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఈరోజు ఉదయం శ్రీశైలం ఆలయాన్ని సందర్శించారు. భక్తిశ్రద్ధలతో ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య ప్రధాని మోదీ మల్లికార్జునస్వామి మరియు భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి ప్రత్యేక పూజలతోపాటు పంచామృతాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. భ్రమరాంబ దేవికి ఖడ్గమాల ఆర్పణ చేసి, కుంకుమార్చన నిర్వహించటం జరిగింది. ఈ సందర్భంగా ఆలయం చుట్టూ భక్తుల ఉత్సాహం అలలెత్తింది. మోదీ పూజల్లో గంభీరతతో పాల్గొన్న తీరు అక్కడి సన్నివేశానికి కొత్త వైభవాన్ని తీసుకొచ్చింది.
పూజల అనంతరం ప్రధాని శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ కేంద్రంలోని శివాజీ దర్బార్ హాల్, ధ్యాన మందిరం వంటి ప్రదేశాలను ఆయన తిలకించనున్నారు. శక్తివంతమైన నాయకుడిగా ప్రసిద్ధిచెందిన ఛత్రపతి శివాజీ మహారాజు ఆత్మస్ఫూర్తికి అర్పణగా నిర్మించిన ఈ కేంద్రం, మోదీ సందర్శనతో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాని మోదీతోపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కూడా ఈ పర్యటనలో పాల్గొన్నారు. వారిద్దరూ ఆలయంలో స్వామివారి, అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. ముగ్గురూ కలిసి ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించారు.
మోడీ హెలికాప్టర్ సున్నిపెంట హెలిప్యాడ్ వద్ద ల్యాండ్ కావడంతో అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలానికి చేరుకున్నారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలంలో ముందస్తుగా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు విభాగాలు సమన్వయంతో భద్రతను పటిష్టం చేశాయి. ఈ సందర్భంగా శ్రీశైలం పట్టణం అంతా భక్తిరసమయంగా మారింది. ప్రధాని పర్యటనతో దేవస్థానానికి ప్రత్యేక ఆదరణ లభించగా, స్థానిక ప్రజలు ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకున్నారు. మోదీ పర్యటన శ్రీశైలానికి మళ్లీ జాతీయ ప్రాధాన్యత తీసుకొచ్చినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన దృశ్యాలు:















