
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ అక్టోబర్ 29: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాల వల్ల కోతకు వచ్చిన వరి, ఏరేందుకు సిద్ధంగా ఉన్న పత్తి తదితర పంటలకు ఎంతో నష్టం వాటిల్లుతుందని, ఎకరాకు రూ.40 వేల చొప్పున రైతులకు నష్టపరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేనివిధంగా అకాల వర్షాలతో కోతకు వచ్చిన వరి పంటలు గింజలు నేలరాలి రైతులు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడం జరుగుతుందన్నారు. కొంతమంది రైతులు కోసిన ధాన్యాన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకువెళ్లి కుప్పలు పోయేగా సకాలంలో కొనుగోలు జరగకపోవడంతో వర్షానికి తడిసి ధాన్యం ముద్ద అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని బే షరతుగా కొనుగోలు చేయాలన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి రైతులను ఆదుకునేందుకు తక్షణమే తగిన చర్యలు చేపట్టాలన్నారు. రైతులకు ఉచితంగా టార్పలిను కవర్లు ఇచ్చి కోసి ఆరబెట్టిన ధాన్యం తడవకుండా రక్షించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను, ప్రజలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కొండారెడ్డి విజ్ఞప్తి చేశారు.

హుజురాబాద్ సింగిల్ విండో చైర్మన్ ఎడవల్లి కొండల్ రెడ్డి





