
– ఘనంగా ఐఎఫ్ డబ్ల్యూజే వజ్రోత్సవ సంబరాలు
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
జర్నలిస్టు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐఎఫ్ డబ్ల్యూజె జాతీయ కౌన్సిల్ సభ్యులు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్ చేశారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఐఎఫ్ డబ్ల్యూజె) 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ లోని ఫెడరేషన్ కార్యాలయంలో మంగళవారం వజ్రోత్సవ సంబరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ గత 75 సంవత్సరాలుగా జర్నలిస్టుల సమస్యలపై చేస్తున్న పోరాటాలను, సాధించిన విజయాలను గుర్తు చేసుకున్నారు.
ముందుగా జాతీయ అధ్యక్షుడు కామ్రేడ్ డాక్టర్ కె. విక్రమ్ రావుకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం బాపురావు మాట్లాడుతూ…ఐఎఫ్ డబ్ల్యూజే దేశంలోనే తొలి జర్నలిస్టు యూనియన్ అని, 1950 అక్టోబర్ 28న ట్రేడ్ యూనియన్ గా ఏర్పడిందన్నారు. దేశవ్యాపితంగా 30 వేలకు పైగా జర్నలిస్టులు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. దేశంలోనే 28 రాష్ట్రాలతో పాటు శ్రీలంక, నేపాల్, భూటాన్ లోని జర్నలిస్టుల సంఘాలతో సంబంధాలు కలిగి జర్నలిస్టుల సమస్యలపై అంతర్జాతీయ స్థాయిలో కూడా పోరాటాలు చేస్తున్నదని పేర్కొన్నారు. జర్నలిస్టుల శ్రేయస్సు కోసం ఐఎఫ్ డబ్ల్యూజె కొన్ని ప్రధాన డిమాండ్లను అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూ వస్తున్నదన్నారు. అందులో ముఖ్యంగా జర్నలిస్ట్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణం అమలు చేయాలనీ. జర్నలిస్టులకు అవసరమైన సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేయాలనీ, దేశవ్యాప్తంగా జర్నలిస్టుల ఐక్యతను కొనసాగిస్తూ కనీస వేతనం కోసం వేజ్ బోర్డు అమలు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు ప్రభుత్వం హెల్త్ కార్డులను అందించి అన్ని కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులలో పని చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. రాష్ట్రంలో సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలన్నారు. గత సంవత్సరంన్నర కాలంగా అక్రిడేషన్లను పొడిగించడం సరికాదన్నారు. వెంటనే నూతన అక్రిడిటేషన్ కార్డులను అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు నరేందుల ప్రసాద్, రాష్ట్ర కమిటీ సభ్యులు గాదె కరుణాకర్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము గణేష్, సురేష్, సహాయ కార్యదర్శి కిరణ్, నాయకులు శంకర్ రెడ్డి, సతీష్, జీవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.







