
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
ముదిరాజుల కుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి దీవెనలతో కుటుంబాలన్నీ సుఖసంతోషాలతో ఉండాలని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వోడితెల ప్రణవ్ బాబు అన్నారు. హుజురాబాద్ పట్టణ శివారులో రంగనాయకులగుట్ట వద్ద నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద బోనాల పండుగ నిర్వహించగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దమ్మతల్లి అభిషేక పూజలో పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఆయన్ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…గత 8 రోజులుగా భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తూ ఇంత గొప్పగా బోనాలు నిర్వహిస్తున్న ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. హుజురాబాద్ ప్రాంతం ఆధ్యాత్మికతకు, భక్తి శ్రద్ధలతో విలసిల్లాలని కోరుకున్నారు. ఆలయాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి తగ్గట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్దమ్మ తల్లి ఆలయ వేడుకల నిర్వహణ కమిటీ నాయకులు, సభ్యులు, కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పెద్దమ్మ తల్లిని దర్శించుకున్న కాంగ్రెస్ నేత ప్రణవ్ బాబు


పెద్దమ్మ తల్లిని దర్శించుకుని ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రణవ్ బాబు..

పెద్దమ్మ తల్లి బోనాల వేడుకలకు పెద్ద ఎత్తున హాజరైన ముదిరాజ్, బెస్త కులస్తులు..






