
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: భారతదేశం పురాతన సంస్కృతికి నిలయమని, విలువలతో కూడిన విద్య భారతీయ సంస్కృతికి చిహ్నం లాంటిదని వాటిని మనం కొనసాగించాలని శ్రీశ్రీశ్రీ త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి అన్నారు. బుధవారం హుజురాబాద్ పట్టణంలోని వెంకట్ సాయి గార్డెన్ లో ప్రజ్ఞా వికాస తరంగిణి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు విలువలు _ విద్య పై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా జీయర్ స్వామి మాట్లాడుతూ…. బ్రిటిష్ వారి కాలంలో మెకాలే విద్య విధానం ఉండడం వల్ల అప్పటి యువకులు జ్ఞాన సమపార్జన పెద్దగా సంపాదించుకోలేకపోయారని, కేవలం ఉద్యోగం కోసం మాత్రమే అవసరమయ్యేదని అన్నారు. భారతీయ విద్యా విధానం నైతిక విలువలకు, జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచే విధంగా ఉందని అన్నారు. భారతీయ విద్యా విధానంలో పిల్లలకు బాల్యం నుండే బాధ్యతలు హక్కులు విధులు నేర్పడమే కాకుండా నైతికత నేర్పుతున్నారని అన్నారు. శాస్త్రీయ విజ్ఞానం పెరిగిపోయిన సమయంలో కూడా భారతీయ విజ్ఞానం తన ప్రభావం తగ్గలేదన్నారు. మన సంస్కృతికి మూలమైన భగవద్గీతలో చెప్పిన అనేక విషయాలు సమాజంలో మంచిని తెలుపుతున్నాయని అన్నారు. కేవలం మార్కుల కోసమే కాకుండా వాస్తవమైన జ్ఞానాన్ని పిల్లలు విద్య ద్వారా పొందాలని మానవత్వం మానవతా విలువలు కలిగి ఉన్న నేటి పిల్లలు మంచి పౌరులుగా మారుతారని అన్నారు భక్తితో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కూడా పాటించాలని దానివల్ల మనిషి యొక్క జన్మ సార్థకతమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజ్ఞా వికాస తరంగిణి రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ…విద్యార్థులు విలువలతో కూడిన విద్యను అభ్యసించి సమాజంలో మేలు చేసే వ్యక్తులుగా మారాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా నాయకులు ముసిపట్ల తిరుపతిరెడ్డి, సంపత్ రావు, వకులాభరణం వెంకటేశ్వర్లు, బద్దుల రాజ్ కుమార్, పి రవీందర్ రెడ్డి, ఎం ప్రసాద్, ఏ మహిపాల్ రెడ్డి, రమణారెడ్డి, రఘుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













