
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని ఆల్ఫోర్స్ జీనియస్ పాఠశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను బుధవారం రోజున ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాలకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ..
భారతదేశ సంప్రదాయ పండుగల్లో సంక్రాంతి ఒక అత్యంత పవిత్రమైన, ఆనందభరితమైన పండుగ అని, పంటలు చేతికి వచ్చిన సంతోషాన్ని పంచుకునే ఈ పండుగ రైతుల శ్రమకు గౌరవం తెలిపే మహత్తర సందర్భం అని అన్నారు. ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేసే పండుగగా సంక్రాంతి నిలుస్తుందనీ, ఈ పండుగ మనకు కష్టపడే తత్వం, సహనం, ఐక్యత వంటి విలువలను నేర్పుతుందన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపడం, పెద్దలను గౌరవించడం, చిన్నారుల్లో మంచి సంస్కారాలను పెంపొందించడం వంటి గొప్ప లక్షణాలు ఈ పండుగ ద్వారా మనకు లభిస్తాయన్నారు. మన సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకోవడమే కాకుండా, వాటిని రాబోయే తరాలకు అందించడం మన బాధ్యత అని తెలిపారు. తదనంతరం విద్యార్థులతో కలిసి వరి నాటు వేశారు. అలాగే కిండర్ గార్డెన్ పిల్లలకి భోగి పళ్ళు పోశారు. తదనంతరం భోగి మంటవేసి సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన డాన్సులు, మన సంస్కృతిని తెలియజేసే ప్రదర్శనలు, గ్రామీణ వృత్తులు, సాంప్రదాయాలు వాటి విశిష్టత అందరిని అలరించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


భోగి మంటలను ప్రారంభించి తిలకిస్తున్న ఆల్ఫోర్స్ అధినేత వి నరేందర్ రెడ్డి..



చిన్నారులకు భోగి పళ్ళు పోస్తున్న నరేందర్ రెడ్డి..

రైతు వేషధారణలో ఎడ్ల బండి నడుపుతున్న ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి

వరి నాట్లు వేస్తూ… అలరించిన నరేందర్ రెడ్డి






