
–ఈనెల 11న లక్ష మందితో హనుమకొండలో రాష్ట్ర స్థాయి ఓసిల సింహగర్జన సమరభేరి….
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుట్రలను సాగానివ్వబోమని , దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓసి సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, ఐకాస జాతీయ ప్రథాన కార్యదర్శి, ప్రముఖ హైకోర్టు సీనియర్ న్యాయవాది కటంగూరి బుచ్చి రాంరెడ్డిలు పిలుపు నిచ్చారు.

బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఓసి జేఏసీ రాష్ట్ర నాయకుల సమావేశంలో మాట్లాడుతున్న పోలాడి రామారావు, బుచ్చి రాంరెడ్డి..

జనవరి 11న వరంగల్ లో నిర్వహించ తలపెట్టిన ఓసిల సింహగర్జన సభకు సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన ఓసి జేఏసీ రాష్ట్ర నాయకుల సమావేశంలో పోలాడి రామారావు, బుచ్చి రాంరెడ్డి మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పటిష్ట అమలుకు ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
రాజ్యాంగ బద్దంగా ఏర్పడ్డ 10 శాతం ఈడబ్లూఎస్ రిజర్వేషన్ల పై రాజకీయ పబ్బం కోసం కొన్ని దుష్ట శక్తులు ఆయా కులాల్లోని ప్రజలను మభ్య పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఓసిలను పలుచన చేయాలనే కుయుక్తులను సాగనివ్వబోమని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఓసిలకు నేటికీ రాజకీయ రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని, మొన్నటి స్ధానిక సంస్థల సర్పంచ్ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక అంగ బలం ముందు ఓసి అభ్యర్ధులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 50శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోయారని పోలాడి రామారావు, బుచ్చి రాంరెడ్డిలు విచారం, ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుబ్యాంకు రాజకీయాలతో ఓసిలకు నేటికీ తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు. తాము ఎవరికీ వ్యతిరేకం కాదని అన్ని వర్గాల ప్రజలకు అన్ని రంగాల్లో సమన్యాయం జరగాలన్నదే తమ ఓసి జేఏసీ ధ్యేయమని పేర్కొన్నారు. స్ధానిక ఎన్నికల్లో 50 శాతం దాటకుండా ఉన్న రాజకీయ రిజర్వేషన్లలో ఓసిలకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, ఏపీ మంత్రి భరత్, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరవుతున్నట్లు పోలాడి రామారావు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ముందు సింహగర్జన సభ ద్వారా ఈ క్రింది దిమాండ్లు నెరవేర్చాలని ముందుంచుతున్నట్లు పొలాడి రామారావు వెల్లడించారు.
ఓసి ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయించిన మిగిలిపోయిన బ్యాక్ లాగ్ పోస్టులను ఆ వర్గాల వారితోనే వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ జారీకి 10లక్షల ఆదాయ పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు.
టెట్ అర్హత పరీక్ష మార్కులను ఈడబ్ల్యూస్ వర్గాలకు 90 నుంచి 70 మార్కులకు తగ్గించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలను వర్తింప చేయాలని కోరారు. తమ డిమాండ్లను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లేందు కోసం జనవరి నెల 11న సాయంత్రం 3 గంటలకు హన్మకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ లో రాష్ట్ర ఓసి జేఏసీ ఆధ్వర్యంలో లక్ష మందితో నిర్వహించతలపెట్టిన ఓసిల సింహగర్జన భారీ బహిరంగ సభకు ఓసి వర్గీయులందరూ రాజకీయాల కతీతంగా తరలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదే ప్రెస్ క్లబ్ లో బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య, అసెంబ్లీ మాజీ స్పీకర్, ఎంఎల్ సి మధుసూధనాచారి లతో పాటు అంతకు ముందు మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఇనగాల పెద్దిరెడ్డిలను హైదరాబాద్ లో వారి వారి నివాసంలో పోలాడి రామారావు కలిసి శాలువాలు కప్పి ఓసిల సింహగర్జన సమరభేరి సభకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేయగా వారు సానుకూలంగా స్పందించారని పోలాడి రామారావు తెలిపారు.

బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యకు ఆహ్వాన పత్రం అందజేస్తున్న పోలాడి రామారావు…



మాజీ మంత్రులు తన్నీరు హరీశ్ రావు, ఇనగాల పెద్దిరెడ్డిలను హైదరాబాద్ లో వారి వారి నివాసంలో కలిసి, అసెంబ్లీ మాజీ స్పీకర్, ఎంఎల్ సి మధుసూధనాచారికి శాలువాలు కప్పి ఓసిల సింహగర్జన సమరభేరి సభకు ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్న పోలాడి రామారావు…





