
– 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పంతాటి రవీందర్
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి (జమ్మికుంట) జనవరి 18: జమ్మికుంటలో కాంగ్రెస్కు పెరుగుతున్న ప్రజా మద్దతు మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతూ రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ముఖ్యంగా బీజేపీ నుంచి కీలక నేతలు కాంగ్రెస్లో చేరడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఆదివారం జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 7వ వార్డుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు పంథాటి రవీందర్ అధికారికంగా బీజేపీ పార్టీకి గుడ్బై చెప్పి, హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సంప్రదాయ పద్ధతిలో కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన వొడితల ప్రణవ్, హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట, హుజూరాబాద్ మున్సిపాలిటీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అనేక విప్లవాత్మక పథకాలను అమలు చేస్తోందని, వాటికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. పేదలు, కార్మికులు, మహిళలు, యువత, రైతులు అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.
రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసి పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలను కూడా సమగ్రంగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రణవ్ తెలిపారు. జమ్మికుంట పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారిస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన పంథాటి రవీందర్ మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి దృక్పథం నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వెల్లడించారు. జమ్మికుంట పట్టణం, ముఖ్యంగా 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి గా అభివృద్ధి కోసం కాంగ్రెస్ నాయకత్వంతో కలిసి పనిచేస్తానని, ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన ప్రధాన లక్ష్యమని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం అహర్నిశలు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ చేరికల కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ నాయకులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మున్సిపల్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలోకి జరుగుతున్న ఈ తరహా చేరికలు జమ్మికుంట రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయని స్థానిక రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పొనగంటి మల్లయ్య, దేశిని కోటి, సాయిని రవీందర్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సుంకర రమేష్, ములుగురు సదయ్య, అరుకాల వీరేశలింగం, తదితరులు పాల్గొన్నారు.


బీజేపీ సీనియర్ నాయకుడు పంథాటి రవీందర్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న పార్టీ ఇంచార్జ్ ప్రణవ్..





