
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రహదారిపై ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ప్రముఖ సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని తాసిల్దార్ కార్యాలయ ఆవరణలో రోడ్డు భద్రత నియమాలపై ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు భద్రతా నియమాలు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాల నివారణ జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి భద్రత నియమాల పట్ల అవగాహన కలిగి ఉండాలని అప్పుడే ప్రమాదాలు తగ్గుతాయని పేర్కొన్నారు. ప్రస్తుత సమాజంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిందని దీనికి కారణం ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు భద్రతా నియమాలు పాటించక పోవడమేనని, చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదానికి, ప్రాణానికి ప్రమాద కరంగా మారుతుంది అన్నారు. ప్రతి ఒక్కరూ సీటు బెల్టు ధరించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని కోరారు. పిల్లల నుండి పెద్దల వరకు రోడ్డు భద్రత నియమాల గురించి తెలిసేలా ప్రభుత్వం విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. తద్వారా ప్రజల్లో రోడ్డు భద్రత పట్ల చైతన్యం పెరుగుతుందని ఆయన తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడప రాదని వాటి వల్ల అనేక ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం భద్రతా మాసోత్సవాలను జరుపు కుంటుందని, విస్తృతంగా వాటిని ప్రచారం చేయడమే కాకుండా కిందిస్థాయి వరకు ప్రచారాలు అందే విధంగా ప్రయత్నించాలన్నారు. తమతో పాటు ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలు పాటిస్తూ రోడ్డు ప్రమాద రహిత సమాజాలం కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు చందుపట్ల జనార్ధన్, ఖాళీదు హుస్సేన్, మండల వీరస్వామి, భారత ప్రభాకర్, సందేల వెంకన్న, ఇప్పకాయల సాగర్, పెద్దిప్యాట రమేష్ తదితరులు పాల్గొన్నారు.

తాసిల్దార్ కార్యాలయం వద్ద రోడ్డు భద్రత నియమాలపై స్థానికులకు వివరిస్తున్న సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్..





