
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రజలు భక్తిశ్రద్ధలతో పరమేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి మహాశివరాత్రి వేడుకలను జరుపుకుంటున్నారు. హుజురాబాద్ పట్టణంలోని ప్రతాపవాడ శివాలయం, శ్రీ భీమేశ్వర శివాలయం, కందుగుల గ్రామంలోని ఆంజనేయస్వామి ఆలయం, చెల్పూర్, బోర్నపల్లి లోని శివాలయంలు, సిరిసపల్లిలోని శ్రీ రాజరాజేశ్వర శివాలయంలలో శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేయగా భక్తులు శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. హుజురాబాద్ ప్రతాపవాడ శివాలయంలో దేవాలయ కమిటీ శివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లతో పాటు ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ఉదయం నుండి అర్ధరాత్రి వరకు అనేక కార్యక్రమాలను నిర్వహించారు. రాత్రి 10.30 గంటల తర్వాత లింగోద్భవ కార్యక్రమం నిర్వహించారు. సిరిసపల్లి, బోర్నపల్లి, చెల్పూర్ లో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. రంగనాయకుల గుట్ట వద్ద ఉన్న పాటిమీద హనుమాన్ దేవాలయం వద్ద రాత్రి నాగుపాము విగ్రహం వద్దకు వచ్చి పడగవిప్పి కొద్దిసేపు దర్శనం ఇవ్వడం నిజంగా శివయ్యే వచ్చాడంటూ భక్తులు మొక్కి పరవశించిపోయారు. ఈ సందర్భంగా వేద పండితులు భాస్కర్ శర్మ, శంకరయ్య, శ్రీకాంత్ శర్మ, కిరణ్ కుమార్ శర్మ, తిరుమలఆచార్యులు, ప్రదీప్ ఆచార్యులు, రాహుల్ అచార్యులు తదితర పూజారులు ప్రత్యేకంగా శివలింగానికి అభిషేకాలను నిర్వహించారు. పలువురు భక్తులు పరమశివుడికి ఉపవాసం ఉండి జాగరణ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన భజన కార్యక్రమాలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.

పాటిమీద హనుమాన్ దేవాలయం వద్ద రాత్రి నాగుపాము దర్శనం ఇవ్వడంతో భక్తులు పరవశించిపోయారు..


కిందివాడలోని శివాలయం వద్ద దర్శనం చేసుకుంటున్న భక్తులు..


ప్రతాపవాడ శివాలయం వద్ద బారూలు తీరి దర్శనానికి నిలుచున్న భక్తులు..


ప్రతాపవాడ శివాలయం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు..

శివపార్వతుల కల్యాణము అనంతరం దర్శనం చేసుకుంటున్న భక్తులు..





