Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులో సిర్సపల్లి – గణేష్ నగర్ ల మధ్య ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ ఈనెల 23వ తేదీ సోమవారం హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద గ్రామస్తులతో నిరసన దీక్ష చేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ పోల్సాని రామారావు తెలిపారు. ఆదివారం ఆయన గ్రామస్తులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డ్ మూలంగా ముఖ్యంగా సిర్సపల్లి గ్రామం తీవ్రంగా నష్టపోతుందని, మా గ్రామంతో పాటు సింగాపూర్, రంగాపూర్, తుమ్మనపల్లి, మాందాడిపల్లి, హుజురాబాద్ రాంపూర్ గ్రామాలకు మొదట నష్టం జరుగుతుందని తర్వాత 15 కిలోమీటర్ల వరకు దీని ప్రభావం ఉంటుందన్నారు. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ప్రణవ్ బాబు, ఎంపీ బండి సంజయ్ కుమార్, ఇతర పార్టీల ముఖ్య నాయకులు ప్రజల ఆరోగ్యానికి నష్టం కలిగించే డంపింగ్ యార్డ్ విషయంలో స్పందించాలని, అడ్డుకోవాలని అన్నారు. 500 మంది గ్రామస్తులతో హుజురాబాద్ పట్టణంలో నిర్వహించే నిరసన దీక్షను ప్రజాసంఘాల నాయకులు, మేధావులు రాజకీయాల కతీతంగా మద్దతు పలికి ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో నాయకులు విజయ్ కుమార్, వెంకట్ రెడ్డి, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సర్పంచ్ పొలాని రామారావు..





