
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజరాబాద్, ఏప్రిల్ 11: హుజూరాబాద్ నియోజకవర్గం చెందిన బిఆర్ఎస్ రాష్ట్ర యువత విభాగం ప్రధాన కార్యదర్శి, హుజురాబాద్ మండలంలోని పెద్ద పాపయ్య పల్లి గ్రామానికి చెందిన రావుల రాజలింగారెడ్డి శుక్రవారం రాత్రి హైదరాబాదులో తెలంగాణ జాగృతిలో చేరారు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రావుల రాజలింగారెడ్డికి ఆ పార్టీ కండువా కప్పి జాగృతి లోకి సాదరంగా ఆహ్వానించారు. రావుల రాజలింగారెడ్డి మండలంలోని పెద్దపాపయ్య పల్లె గ్రామానికి చెందిన నాయకుడు కాగా ఆయన రాకతో జాగృతి సేవలు హుజురాబాద్ ప్రాంతంలో మరింతగా పెరిగి ప్రజాధరణ పొందేందుకు దోహదపడుతుందని పలువురు భావిస్తున్నారు. హైదరాబాదులో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించిన రాజలింగారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెన్నంటి ఉంటూ తెలంగాణ భవన్లో సుదీర్ఘకాలం ఆ పార్టీకి సేవలు అందిస్తూ కెసిఆర్ వెన్నంటే నడిచారు. పెద్ద పాపయ్యపల్లి గ్రామానికి చెందిన పదిమంది యువకులను తెలంగాణ భవన్ లో ఉంచుకొని ఉద్యమ వ్యాప్తికి భవన్ కేంద్రంగా పనిచేశారు. బిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన రాజలింగారెడ్డి కేసీఆర్ కుటుంబ సభ్యులకు సుపరిచితుడు. ఏళ్ల తరబడి కేసీఆర్ ఇంట్లో నిత్యం ఉంటూ తెలంగాణ ఉద్యమంలో తనదైన స్టైల్ లో చురుకైన పాత్ర పోషించారు. స్వయంగా కెసిఆర్ లింగన్న అంటూ ఆప్యాయంగా పిలుస్తూ పార్టీ కార్యక్రమాలలో రాజ లింగారెడ్డిని బాగస్వాముని చేశారు. అలాంటి ఆయనకు జాగృతి అధ్యక్షురాలు కవితతో గతంలోనే పరిచయాలు ఉండడంతో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రజల్లోకి తీసుకుపోవాలని ఈ సందర్భంగా కవిత రాజలింగారెడ్డికి సూచించారు.

ఈ సందర్భంగా రాజ లింగారెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను పల్లె పల్లెకు తీసుకు వెళ్తానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్యం నింపుతానని అన్నారు. ఆరోగ్యారెంటీ ల పేరుతో ప్రజలను ఏ విధంగా అధికార పార్టీ మోసం చేస్తుందో వివరించి జాగృతి భవిష్యత్తులో చేపట్టే సంక్షేమ కార్యక్రమాలను వివరించి చైతన్య పరుస్తానన్నారు.
నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కరించే విషయంలో ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తామని లింగారెడ్డి తెలిపారు. రాజలింగారెడ్డి జాగృతిలో చేరడం పట్ల హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు, నాయకులు, కవిత అభిమానులు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. రాజలింగారెడ్డి తెలంగాణ జాగృతిలో ఉన్నత స్థానానికి ఎదగాలని, ఆయనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు స్పష్టం చేశారు.







