
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం సిరసపల్లి గ్రామంలో అనర్హులు చేనేత పింఛన్లు పొందుతున్నారన్న ఫిర్యాదులపై గురువారం సమగ్ర విచారణ చేపట్టినట్లు కరీంనగర్ డిఆర్డిఏ అధికారి శ్రీధర్ తెలిపారు. గ్రామంలో అనర్హులైన చేనేత కార్మికుల పేరుతో కొంతమంది పింఛన్లు పొందుతున్నారని వాటిపై విచారణ జరపాలని ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో గత రెండు నెలల క్రితం 17 మంది చేనేత కార్మికుల పింఛన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నేపథ్యంలో గురువారం డిఆర్డిఏ అధికారి శ్రీధర్, ఎంపీడీవో తూర్పాటి సునీతలు 17 మంది చేనేత పింఛన్దారులను పిలిపించి మండల పరిషత్ కార్యాలయంలో విచారణ నిర్వహించారు. కాగా ఈ విచారణకు పలువురు గైరాజరయ్యారు. విచారణలో వారి వద్ద ఉన్న ఆధారాలను, ఆధార్ కార్డు ఇతర గుర్తింపు పత్రాలను సేకరించారు. కాగా పలువురు వద్ద సరైన ఆధారాలు లేకపోయినట్లు గుర్తించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…
ఉన్నతాధికారుల ఆదేశం మేరకు చేనేత కార్మికుల పింఛన్లపై విచారణ జరిపామని, 2016, 2022 నుండి కొంతమంది పింఛన్లు పొందుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వారిలో చేనేత కార్మికుడిగా పని చేస్తున్నట్లు చూపే ఎలాంటి ఆధారాలు చూపని వారి వివరాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని, అనర్హులు పింఛన్ పొందితే వాటిని రికవరీ చేయాల్సి ఉంటుందన్నారు. అర్హులకు సంబంధించిన పింఛన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అన్నారు.
—దళారుల మాటలు నమ్మకండి.
గ్రామీణ ప్రాంతాల్లో ఏదో ఒక పింఛన్ పెట్టిస్తామని దళారులు అమాయక ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వారి మోసపు మాటలు నమ్మకూడదని అన్నారు. సరైన అర్హత ఉంటే ప్రభుత్వ అధికారులకు దరఖాస్తు చేసినట్లయితే పింఛన్లు మంజూరు అవుతాయని దీనిలో ఎవరి ప్రమేయం ఉండదని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పోల్సాని రామారావు, ఉప సర్పంచ్ జనగామ రాజేశ్వరరావు, కార్యదర్శి సంపత్ తదితరులు పాల్గొన్నారు.

విచారణ జరిపిన డీఆర్ డిఏ అధికారి శ్రీదర్

విచారణకు హాజరైన బాధితులు





