
—రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఏప్రిల్ 26 : ఉద్యమాల గడ్డగా పేరొందిన హుజురాబాద్… డంపింగ్ యార్డ్ ఏర్పాటుతో కాష్టాల గడ్డగా మారే ప్రమాదం ఉందని రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నిమ్మటూరి సాయికృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
డంపింగ్ యార్డ్కు వ్యతిరేకంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కొనసాగుతున్న నిరవధిక దీక్షకు హుజురాబాద్ రజక సంఘం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


అనంతరం చౌరస్తా వద్ద మోకాళ్లపై కూర్చొని నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రజక యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాయికృష్ణ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా పట్టణ పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. కాలుష్యం పెరిగి అనారోగ్య సమస్యలు ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల జీవన ప్రమాణాలు దెబ్బతింటాయని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ సాధన కోసం జరిగిన సకల జనుల సమ్మె తరహాలోనే డంపింగ్ యార్డ్ వ్యతిరేక పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కొలిపాక పోచయ్య, కొలిపాక సారయ్య, కొలిపాక శ్రీనివాస్, నల్ల బాలరాజు, గోపు వెంకటేశ్వర్లు, కొలిపాక శ్రీనివాస్ (బిజెపి), కొండపాక లక్ష్మి, కొలిపాక లలిత, రామారపు రాధా, పలకల ఈశ్వర్ రెడ్డి, కట్కూరి మల్లారెడ్డి, వి రత్నం, ప్రభాకర్, కొలిపాక సమ్మయ్యతోపాటు రజక సంఘం నాయకులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.





