Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (విద్యారణ్యపురి): కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని విద్యానగర్ కాలనీలో శనివారం సాయంత్రం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. భవనంపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ కింద పడి శ్రీవాస్తవ్ (14) అనే తొమ్మిదో తరగతి విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్ కాలనీకి చెందిన మంచికట్ల సంపత్, మాలతి దంపతుల చిన్న కుమారుడు శ్రీవాస్తవ్. శనివారం సాయంత్రం ఇంటిపై ఆడుకుంటుండగా ఒక్కసారిగా అదుపు తప్పి కింద పడిపోయాడు. తీవ్ర గాయాలైన విద్యార్థిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హుజూరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం, పరిస్థితి విషమించడంతో వైద్యులు బాధితుడిని వరంగల్ ఎంజీఎం (MGM) ఆసుపత్రికి తరలించాలని సూచించారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన వరంగల్కు తరలిస్తుండగా, మార్గమధ్యలోనే శ్రీవాస్తవ్ పరిస్థితి క్షీణించి మృతి చెందాడు.
—కుటుంబంలో విషాద ఛాయలు
మృతుడి తండ్రి సంపత్ పెద్దపల్లి జిల్లాలో ప్రభుత్వ టీచర్ గా ఉద్యోగము చేస్తుండగా, తల్లి మాలతి హుజూరాబాద్లోని టెట్రా హెడ్రాన్ హైస్కూల్లో ప్రైవేట్ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు కాగా, చిన్న కుమారుడు శ్రీవాస్తవ్ (14) మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీరని శోకం నెలకొంది. విద్యానగర్ కాలనీలో ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. కాగా సంపత్ సొంత గ్రామం సైదాపూర్ మండలం రాములపల్లి.




