
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
అన్నధాతలను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజాసంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పాలకులను హెచ్చరించారు. రాష్ట్రంలో మొక్కజొన్న, వరి దాన్యం కొనుగోళ్లు, తరలింపు ప్రక్రియలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతుందని రైతు ప్రజా సంఘాల జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆవేదన వ్యక్తం చేశారు.

పంటల కొనుగోళ్లు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నా నేటికీ నత్త నడకన సాగుతోందని విమర్శించారు. మద్దతు ధరతో పాటు ప్రభుత్వం ప్రకటించిన 500 రూ. బోనస్ ను అడిగితే రక రకాల కొర్రీలు పెడుతున్నారని, కొనుగోలలో పాలకులు నిర్లక్షంగా వ్యవహరిస్తూ కమీషన్లకు కక్కుర్తి పడి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేసేందుకే పాలకులు ఇదంతా చేస్తున్నారని పోలాడి ఆరోపించారు. అధికారులు మిల్లర్లు కుమ్మక్కై తేమ, తాలు పేరుతో క్వింటాల్ కు 6 నుండి 8 కిలోలు కోత విధిస్తూ రైతులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతులు దాన్యాన్ని ఎండబెట్టే క్రమంలో తీవ్రమైన ఎండలతో రైతులు మృత్యువాత పడటం కలచి వేసిందన్నారు. రైతుల సమస్యలపై పోరాటమే లక్ష్యంగా ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ డిమాండ్ల సాధనకు రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో
ఈనెల 30న కరీంనగర్ లో భారీ ఎత్తున నిర్వహించే రైతు మహాగర్జన సమరభేరి సభ విజయవంతానికి కరీంనగర్ పట్టణంలో నాయకులతో కలిసి పోలాడి రామారావు విస్తృతంగా పర్యటిస్తూ వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టారు.

రైతుమహగర్జన వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డి


వాల్ పోస్టర్ ఆవిష్కరిస్తున్న బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకర్ రావు
ఇందులో భాగంగా బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోల్సాని సుగుణాకర్ రావు, పెద్దపల్లి మాజీ శాసన సభ్యుడు గుజ్జుల రామకృష్ణారెడ్డిలను బుధవారం కరీంనగర్ లో వారి వారి నివాసంలో రైతు మహాగర్జనకు సభకు ఆహ్వానిస్తూ పోలాడి రామారావు నాయకులతో కలిసి ఆహ్వాన పత్రికలను అందజేయగా అందుకు వారు సానుకూలంగా స్పందించి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించి రామారావుతో కలిసి గోడ ప్రతులను ఆవిష్కరించారు. అనంతరం సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పత్తి వాసుదేవరెడ్డిని, సిపిఐ జిల్లా కార్యాలయంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ ప్రస్తుత డిప్యూటీ మేయర్ వై. సునీల్ రావు, మాజీ మేయర్లు రవీందర్ సింగ్, డి.శంకర్ లను కలిసి రైతు మహాగర్జన సభ ఆహ్వాన పత్రికలను అందజేసి గోడ ప్రతులను వారిచే రామారావు ఆవిష్కరింపజేశారు.
తాము సంపూర్ణంగా రైతుల మహాగర్జన సమర భేరి సభకు తమ పార్టీల తరపున మద్దతు పలుకుతూ పెద్ద ఎత్తున రైతులతో కలిసి సమావేశానికి తరలి వస్తామని వారు ప్రకటించడం పట్ల ప్రజా సంఘాల తరపున రామారావు కృతజ్ఞతలు తెలిపారు.
అన్నదాతలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తక్షణమే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.
కరీంనగర్ లో భారీ ఎత్తున నిర్వహించే రైతుల మహాగర్జన సమర భేరి సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే 20 వేల మంది మహిళలను రైతులను తరలుస్తున్నామని రామారావు తెలిపారు.





