
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పరకాల క్రాస్ రోడ్డు వద్ద పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టును కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం మంగళవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టు వద్ద అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలించి, భద్రతా చర్యలపై సిబ్బందితో సమీక్షించారు.

ఈ తనిఖీ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. జిల్లా సరిహద్దుల గుండా పశువుల అక్రమ రవాణా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా రాత్రి, పగలు తేడా లేకుండా వచ్చే భారీ కంటైనర్ వాహనాలను, ఇతర అనుమానాస్పద వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందికి స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, అక్రమ రవాణాకు పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు.

ఈ ఆకస్మిక తనిఖీలో స్థానిక ఇన్స్పెక్టర్ కరుణాకర్ తో పాటు పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.





