Oplus_16908288
స్వర్ణోదయం ప్రతినిధి హైదరాబాద్: తెలంగాణలోని నిరుద్యోగులకు టీజీపీఎస్సీ శుభవార్త చెప్పింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు ఒకేరోజు 3 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందులో అటవీ శాఖలోనే 3 వేలకుపైగా ఖాళీలు ఉన్నాయని తెలిపింది. అదే సమయంలో ఈనెలలోనే మరిన్ని నోటిఫికేషన్లను కూడా రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇక ఉద్యోగాలను ఓఎంఆర్లో కాకుండా సీబీటీ విధానంలోనే నిర్వహిస్తామని టీజీపీఎస్సీ తేల్చి చెప్పింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన నిరుద్యోగులకు శుభవార్త చెప్పేందుకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే రేపు ఒక్కరోజే 3 రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తాజాగా వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియలో వేగాన్ని పెంచడంతో పాటు.. ఎలాంటి అవకతవకలు లేకుండా పరీక్షల నిర్వహణలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం నుంచి 3,800 ఖాళీ పోస్టుల భర్తీకి అనుమతులు వచ్చినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ వెల్లడించారు. ఇందులో అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 3,093 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇక వివిధ శాఖల్లో ఒక్కో పోస్ట్ చొప్పున 25 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ఇక నుంచి రెగ్యులర్గా నోటిఫికేషన్లను టీజీపీఎస్సీ విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రతీ నెల సగటున 3 నోటిఫికేషన్లను జారీ చేసినట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రేపు 3 కొత్త నోటిఫికేషన్లను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఇక నుంచి టీజీపీఎస్సీ ఏ ఉద్యోగ నియామక ప్రక్రియ ప్రారంభించినా.. దాన్ని గరిష్ఠంగా ఒక సంవత్సరం లోపే పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఛైర్మన్ బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. అదే సమయంలో ఇక నుంచి టీజీపీఎస్సీ నిర్వహించే అన్ని నియామక పరీక్షలను పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలోనే నిర్వహించనున్నట్లు తేల్చి చెప్పారు. సీబీటీ వల్ల పేపర్ లీకేజీలకు అవకాశం ఉండదని.. పరీక్ష పేపర్ను ముందే తయారు చేయడం అనేది కూడా ఇక నుంచి ఉండదని చెప్పారు. ఇక అభ్యర్థులు పరీక్ష రాసిన వెంటనే వారు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాశారో కూడా తెలిసేలా సరికొత్త టెక్నాలజీని తీసుకురానున్నట్లు ఆయన ఒక హింట్ ఇచ్చారు.
ఇక టీజీపీఎస్సీ చేపట్టే ఉద్యోగ నియామకాల్లో మొదట నోటిఫికేషన్ విడుదల.. ఆ తర్వాత పరీక్ష నిర్వహణ.. అనంతరం.. మెరిట్ లిస్ట్ రిలీజ్.. చివరిగా సెలక్షన్ లిస్ట్ అనే దశల్లో కచ్చితంగా పారదర్శక విధానాన్ని పాటిస్తామని బుర్రా వెంకటేశం తేల్చి చెప్పారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు లేవు అనే నమ్మకాన్ని అభ్యర్థుల్లో కలిగించడానికే తాము కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
అదే సమయంలో దరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికీ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదని.. వారిలో కేవలం 0.1 శాతం మందికి మాత్రమే ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. జాబ్ రాని వారు టీజీపీఎస్సీపై దుష్ప్రచారం చేయడం సహజమేనని.. అయితే మిగిలిన అభ్యర్థులు వాటిని పట్టించుకోవద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వంలోని యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ (యూపీఎస్సీ) అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలనే తెలంగాణలో అవలంబించనున్నట్లు బుర్రా వెంకటేశం స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణకు ప్రతిభా భారతి అనే సరికొత్త పద్ధతిని కూడా తీసుకురానున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ వెల్లడించారు.





