
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఆడబిడ్డలకు ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఇవ్వాలని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం హుజూరాబాద్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడపిల్లల కోసం మేనమామగా, పెద్ద దిక్కుగా ఉండే విధంగా ఆలోచించి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. మొదలు యాభై వేల రూపాయల నుండి ప్రస్తుతం లక్ష 16 వేల వరకు గత ప్రభుత్వం పెంచిందన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం కూడా ఆడబిడ్డలకు ఇచ్చి మాట నిలబెట్టుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆడబిడ్డలు ప్రసవించిన తర్వాత వారి పిల్లలకు అవసరమయ్యే కెసిఆర్ కిట్టు పథకం వల్ల ఎంతో ఉపయోగమని, ప్రభుత్వం దానిని కొనసాగించడం లేదని ప్రజలకు ఉపయోగపడే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రస్తుత ప్రభుత్వానికి కోపం ఉంటే ఇందిరమ్మ పేరు గాని మరొకరి పేరు గాని పెట్టి పథకాన్ని కొనసాగించాలని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ పథకం అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెడితే ప్రజలకు ఉపయోగపడే పథకం కాబట్టి బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ పథకాన్ని కొనసాగించిందన్నారు. మహిళలకు ఇచ్చే పింఛన్ సాధ్యమైనంత తొందరలో పెంచాలని ఆయన కోరారు. మున్సిపల్ చైర్ పర్సన్ రొంటాల సుహాసిని మాట్లాడుతూ…. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదలకు ప్రయోజనం అవుతుందని అన్నారు. సింగిల్ విండో చైర్మన్ ఎడవెల్లి కొండల్ రెడ్డి మాట్లాడుతూ…. కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా పేదింటి ఆడపిల్లలకు చేయూతనిచ్చినట్లు అవుతుందన్నారు. ఈ సందర్భంగా 94 మందికి 94,10,904 రూపాయల చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో తూర్పాటి సునీత, తహసిల్దార్ జక్కని నరేందర్, కౌన్సిలర్లు కొలుగూరి సుమలత, సొల్లు సునీత, మేకల స్వరూప, గందె శ్రీనివాస్, ఇల్లందుల సమ్మయ్య, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి


లబ్ధిదారులతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని, కౌన్సిలర్లు..






