
- మాజీ ఎంపీ, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్
- రేవంత్ ప్రభుత్వం ఆరో మాసంలోకి ప్రవేశించిందనీ మొదటి ఆరు మాసాలు చాలా కీలకం అని మాజీ ఎంపీ టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. హైదరాబాదులోని తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎవరికైనా గ్రేడింగ్ ఇవ్వాలంటే మొదటి ఆరూ నెలలు ముఖ్యమైనవన్నారు. రేవంత్ రెడ్డి ఈ ఆరు నెలల్లో తన ఫ్లాగ్ షిప్ ప్రోగ్రాం అని చెప్పుకోవడానికి ఏమీ లేదన్నారు. నేటి కేబినెట్ సమావేశంలో మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నామన్నారు. రైతు బంధు దేశంలోనే మొదటి సారి అమలు చేసిన ఘనత కేసీఆర్ ది అన్నారు. పీఎం సహా అనేక రాష్ట్రాల సీఎంలు రైతు బంధును ప్రశంసించారనీ గుర్తు చేశారు. ఇదే అనేక రైతు పెట్టుబడి సాయం పథకాలకు స్ఫూర్తి అన్నారు. రైతుబంధు అనేది కాపిటల్ ఇన్వెస్ట్ మెంట్ అని, రోహిణీ కార్తెలో తొలకరి జల్లులు వస్తాయన్నారు. సగటు రైతు పెట్టుబడి కోసం రోహిణి కార్తెలో పిల్లి కూనవలె తిరుగుతూఉంటారన్నారు. రైతుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కేసీఆర్ రైతు బంధు పథకం తెచ్చారనీ గుర్తు చేశారు. దున్నెపుడే రైతుకు పెట్టుబడి సాయం వస్తే ఉపశమనంగా ఉంటుందన్నారు. రేవంత్ యాసంగి రైతు బంధు పంటలు కోసే సమయానికి ఇచ్చారనీ ఎద్దేవా చేశారు. ఈ సారి అలాంటి తప్పు చేయకుండా రైతు భరోసాను రోహిణి కార్తెలో విడుదల చేసేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకోవాలన్నారు. జూన్ మొదటి వారంలోనే రైతులకు ఎకరాకు 7500 రూపాయలు విడుదల చేయాలనీ, ఆ దిశగా కేబినెట్ లో నిర్ణయించాలన్నారు. వర్షా కాలంలోనే ఎక్కువగా సన్న రకాల ధాన్యం పండిస్తారనీ, రబీ లో నూకల శాతం ఎక్కువగా ఉంటుందని రైతులు సన్న రకాలు సాగు చేయరన్నారు. క్వింటాల్ కు 500 రూపాయలు బోనస్ సన్న వడ్లకే ఇస్తామనడం రైతులను మోసం చేయడమే అన్నారు. అన్ని రకాల వడ్లకు రూ.500 బోనస్ ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. తిట్ల మీద కాకుండా రైతులకు మేలు చేయడంపై కేబినెట్ మీటింగ్ లో చర్చించాలనీ సూచించారు. బోనస్ ను బోగస్ గా మార్చకండనీ చెప్పారు. రేవంత్ కు ఇదే కీలకమైన కేబినెట్ సమావేశమనీ,మంచి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు సన్నవడ్లకే బోనస్ అని సీఎం అంటే కాంగ్రెస్ కు డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కావు అన్నారు. తడిసిన ధాన్యం రైతుల దగ్గర ఎంత ఉన్నా ఈ ప్రభుత్వం కొనుగోలు చేసి తీరాల్సిందేనని సూచించారు. ఈ సమావేశంలో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.