
–వెతుకుతున్న ప్రత్యేక బృందాలు
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
అమెరికాలో భారతీయ మూలాలున్న విద్యార్థులు వరుసగా సమస్యల్లో చిక్కుకోవడం కలకలం రేపుతోంది. తాజాగా కాలిఫోర్నియా రాష్ట్రంలో ఓ 23 ఏళ్ల తెలుగు విద్యార్థిని అదృశ్యమైంది. గత వారం రోజులుగా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులు ప్రజల సాయం కోరారు.
హైదరాబాద్కు చెందిన నితీశ కందుల కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ, శాన్ బెర్నార్డినో లో చదువుతోంది. మే 28వ తేదీ నుంచి కన్పించకుండా పోయింది. చివరిసారిగా ఆమె లాస్ ఏంజిల్స్లో కన్పించినట్లు యూనివర్సిటీ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఆ తర్వాత నుంచి నితీశ అదృశ్యమైనట్లు తెలిపింది. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ఆమె గురించి సమాచారం తెలిస్తే వెంటనే తమకు తెలియజేయాలని స్థానికులను కోరారు. గత నెల తెలంగాణకు చెందిన రూపేశ్ చంద్ర చింతకింది షికాగోలో అదృశ్యమైన సంగతి తెలిసిందే. ఇప్పటికీ అతడి ఆచూకీ తెలియ లేదు. ఇక, ఈ ఏడాది మార్చిలో హైదరాబాద్కు చెందిన మహ్మద్ అబ్దుల్ అరాఫత్ కన్పించకుండా పోయాడు. ఆ తర్వాత నెల రోజులకు క్లీవ్లాండ్లోని ఒహాయోలో ఓ సరస్సు వద్ద అతడి మృతదేహం లభ్యమైంది. క్లీవ్లాండ్లోని ఓ డ్రగ్ ముఠా అబ్దుల్ను కిడ్నాప్ చేసి.. అతడి తండ్రికి ఫోన్ చేసి డబ్బు పంపాలని డిమాండ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.
